వరంగల్కు ఔటర్ రింగ్ రోడ్డు: శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
వరంగల్ నగర అభివృద్ధి కార్యక్రమాలపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఈరోజు సచివాలయంలోసమావేశం నిర్వహించారు.
వరంగల్: వరంగల్ నగర అభివృద్దిపై దృష్టి పెట్టిన తెలంగాణ సర్కార్ ఔటర్ రింగ్ రోడ్డు పనులను ప్రారంభించనుంది. జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఈ పనులకు శంకుస్థాపన చేయాలని సర్కార్ నిర్ణయించింది.
కాగా, ఈ పనులను 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే ప్రభుత్వం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కొత్త మాస్టర్ ప్లాన్ ను మార్చి 4వ తేదీన నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయాలని భావిస్తోంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వరంగల్ నగర అభివృద్ధి కార్యక్రమాలపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఈరోజు సచివాలయంలోసమావేశం నిర్వహించారు. సమావేశానికి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, వరంగల్ నగర మేయర్, ఎమ్మెల్యేలు, మున్సిపల్ అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా కడియం మాట్లాడుతూ వరంగల్ నగర అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని తెలిపారు. అన్ని రకాల మౌలిక సదుపాయాలు, వసతులతో ఔటర్ రింగ్ రోడ్ ను నిర్మించేందుకు కసరత్తులు చేస్తున్నామని, రింగ్ రోడ్డు శంకుస్థాపనకు జూన్ 2న ముహూర్తం ఖరారు చేశామని అన్నారు.
మొత్తం 72కి.మీ మేర ఏర్పాటు చేయనున్న ఈ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రతీ 20కి.మీకు ఒక విశ్రాంతి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కడియం తెలియజేశారు.