పీవీ చేతకానితనం, ఆయన అతి పెద్ద తప్పిదం అదే: ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు విధ్వంసం అనేది నాటి ప్రధాని పి.వి.నరసింహారావు తప్పిదాల్లో అతి పెద్ద తప్పిదమని ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. ప్రణబ్ రాసిన ది టర్బులెంట్ ఇయర్స్ రెండో వాల్యూమ్ పుస్తకాన్ని గురువారం విడుదల చేశారు.
బాబ్రీ విధ్వంసం వల్ల ముస్లింల సెంటిమెంట్లను ఆయన దెబ్బతీశారని రాశారు. బాబ్రీని కాపాడలేకపోవడం పీవీ చేతకానితనమని అన్నారు. బాబ్రీ విధ్వంసంతో భారతీయుల తలలు సిగ్గుతో తలదించుకునేలా అయ్యాయని ప్రణబ్ తన పుస్తకంలో రాశారు.
బాబ్రీ విధ్వంసం కాకుండా ఉండేందుకు అన్ని పార్టీల నేతలతో చర్చలు జరిపి కఠిన చర్యలు తీసుకుని ఉండాల్సిందని ప్రణబ్ చెప్పారు. ఆపత్సమయంలో మీకు సలహాలు ఇచ్చేవారు ఎవరూ లేరా అని తాను పీవీని అడిగినట్లుగా ప్రణబ్ పుస్తకంలో రాశారు.

బాబ్రీ విధ్వంసం వల్ల ముస్లింల సెంటిమెంట్లు దెబ్బతింటాయనే విషయాన్ని గుర్తించలేకపోయారా అని పీవీపై విరుచుకుపడినట్లు రాశారు. అయితే దీనికి జవాబుగా పీవీ ఎప్పటిమాదిరిగానే ఏమీ అర్ధం కాని ఎక్స్ ప్రెషన్ పెట్టారని ప్రణబ్ రాశారు.
ప్రధానమంత్రి పదవిని తానెప్పుడూ ఆశించలేదని, ఇందిరాగాంధీ హత్యానంతరం తనపై వచ్చిన పుకార్లన్నీ ద్వేషపూరితమైనవని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. రాష్ట్రపతి తన జ్ఞాపకాల ఆధారంగా రచించిన రెండో పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ గురువారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం పార్టీ తక్షణ కర్తవ్యాల గురించి మాట్లాడేందుకు తాను రాజీవ్గాంధీని కలిశానని చెప్పారు. అప్పుడు తాను ఒంటరిగా చర్చించి పార్టీ నేతలంతా రాజీవ్ ప్రధాని కావాలనుకుంటున్న విషయాన్ని చెప్పానన్నారు.
అందుకు రాజీవ్ గాంధీ కూడా ఒప్పుకొన్నారని, ఆ తర్వాత తాను ఈ విషయాన్ని పార్టీ నేతలకు వెల్లడించానన్నారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ రాష్ట్రపతి తన పుస్తకంలో రాశారు.అయితే రాజీవ్ గాంధీ ప్రధాని అయిన తర్వాత, తనపై ఎవరో చెడుగా చెప్పారన్నారు.
దీంతో రాజీవ్ తనను కేబినెట్ పదవి నుంచి, ఆ తర్వాత పార్టీ నుంచి కూడా తొలగించారని గుర్తుచేశారు. రాజీవ్ ఇతరుల మాట విని తప్పు చేశారని, తానూ తప్పు చేశానని ప్రణబ్ అన్నారు. తానూ ఒక దశలో సహనం కోల్పోయి నిస్పృహకు లోనయ్యానన్నారు. తనకు వ్యతిరేకంగా రాజీవ్ గాంధీ మంత్రివర్గం దారుణమైన ప్రచారం సాగించిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications