శాంతియుత సహజీవనం: ‘ముస్లింలు ప్రవక్త ఆదేశాలు పాటించాలి’(ఫొటోలు)
హైదరాబాద్: నేడు ముస్లిం సముదాయం ఇస్లాం ధర్మ సూచనలు విస్మరిస్తున్నదని, మహ్మద్ ప్రవక్త ఉపదేశించిన మార్గంలో నడువకపోతే ఇహ, పరలోక జీవితంలో అనర్థాలు, నష్టాలు ఎదుర్కొనక తప్పదని ముస్లిం మతగురువులు హెచ్చరించారు. చెడు చెడుతో సమసిపోదు.. మంచితోనే దానిని దూరం చేయాలనే సందేశాన్ని ఇస్లాం వ్యాప్తి చేస్తోందని అఖిల భారత ఇస్లాం సమ్మేళనంలో వ్యాఖ్యానించారు.
తబ్లిక్ ఈ జమాత్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పహడీషరీఫ్లో మూడు రోజుల పాటు నిర్వహిస్తోన్న ఈ సమ్మేళనంలో మతగురువులు రెండో రోజైన ఆదివారం రోజంతా ఉపదేశాలు చేశారు.
మౌలానా అస్లం నాగ్పూరీ, మౌలానా ఖాసీం ఖురేషీ, మౌలానా షౌకత్ షితాపూరీ, మౌలానా మహ్మద్ ముస్తాఖ్ ఖాస్మీతోపాటు పలువురు మత ప్రముఖులు రెండోరోజు వివిధ ఆంశాలపై ముస్లింలకు ధార్మిక బోధనలు చేశారు.
ఇస్లాం శాంతియుత సహజీవనాన్ని కోరుకుంటుందన్నారు. మనుషులుగా మనం ఆయన చూపిన మార్గంలో నడవడం ద్వారా ఆయన ప్రేమను పొందవచ్చని సూచించారు. కాగా, మూడు లక్షల మంది మహా సభలకు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు.
జిల్లాలు, ప్రాంతాలవారీగా టెంట్లు ఏర్పాటు చేశారు. ఎక్కడివారు అక్కడే వంట చేసుకోవడానికి, పడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా నీటి సౌకర్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాటర్ ట్యాంక్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. మహా సభల ప్రాంగణంలోకి వెళ్లే ప్రతి ఒక్కరినీ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతిస్తున్నారు.