నమస్తే తెలంగాణ ఓ కరపత్రం: గుత్తా, మనకో సైనికుడు కావాలన్న కవిత
హైదరాబాద్/ వరంగల్: నమస్తే తెలంగాణ టీఆర్ఎస్ కరపత్రంలా మారిందని తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రకటనలు తీసుకుని సొంత ప్రచారం చేసుకునే పార్టీల పత్రికలు, టీవీలపై పార్లమెంట్లో ప్రస్తావిస్తామని ఆయన చెప్పారు.
గుత్తా సుఖేందర్రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెసు నాయకులు సోమవారం ఎన్నికల కమిషనర్ భన్వర్లాల్ను కలిశారు. టీఆర్ఎస్కు ఓటేయకపోతే కళ్లు పోతాయని వ్యాఖ్యానించిన పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కోడ్ ఉల్లంఘిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని భన్వర్లాల్ను కోరారు. ఓటమి భయంతో ప్రజలను ప్రలోభ పెడుతున్నారని గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు.
వరంగల్ ఏకపక్షమని భావిస్తే మంత్రులకు వెనక్కి పిలవాలని కేసీఆర్కు సవాల్ చేస్తున్నామని కాంగ్రెస్ నేత గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మంత్రులు విధాన ప్రకటనలతో కోడ్ ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీపీలు, ఎంపీటీసీలను కొనుగోలు చేస్తున్నారని, లొంగకపోతే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ ధన ప్రవాహంతో గెలవాలని చూస్తోందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వచ్చేది లేదు, పోయేది లేదని గుత్తా సుఖేందర్రెడ్డి వ్యాఖ్యానించారు.
పార్లమెంట్లో మనకింకో సైనికుడు కావాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల కవిత అన్నారు. దయాకరన్నను మనమంతా కలిసి గెలిపిస్తే ప్రజల తరపున పార్లమెంట్లో మాట్లాడతారని తెలిపారు. ఇప్పుడున్న ఎంపీలకు ఇంకో ఎంపీ తోడైతే మన గళాన్ని గట్టిగా వినిపించొచ్చని తెలిపారు. ఇలాంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.