గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు షాకిచ్చిన నాంపల్లి ప్రత్యేక కోర్టు .. ఆ కేసులో ఏడాది జైలు శిక్ష
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు నాంపల్లి ప్రత్యేక కోర్టు షాక్ ఇచ్చింది. నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపిన ఓ కేసులో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఏడాది జైలు శిక్ష విధించింది. ఐదేళ్ల క్రితం బీఫ్ ఫెస్టివల్ వివాదంలో రాజాసింగ్ పై కేసు నమోదైంది .ఈ కేసును విచారించిన నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఏడాదిపాటు రాజాసింగ్ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
కేటీఆర్ సీఎం అయితే కవిత, హరీష్ లకు సమస్య , రసమయిని సీఎం చెయ్ : రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
బీఫ్ ఫెస్టివల్ సమయంలో రాజా సింగ్ తీవ్ర వ్యాఖ్యలు , పోలీసులతో దురుసు ప్రవర్తన
2016లో ఉస్మానియా యూనివర్సిటీ బీఫ్ ఫెస్టివల్ పై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉస్మానియాలో బీఫ్ ఫెస్టివల్ చేస్తే మరో దాద్రి అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు అప్పుడు చోటు చేసుకున్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్నప్పటికీ ఆయన అదే స్థాయిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పుడు రాజాసింగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను బొల్లారం పీఎస్ కు తరలించారు.
రాజా సింగ్ పై కేసు నమోదు .. కేసులో నాంపల్లి కోర్టు తీర్పు.. బెయిల్ తీసుకున్న ఎమ్మెల్యే
బొల్లారం పోలీస్ స్టేషన్ లోనూ ఆయన పోలీసులు పట్ల చాలా దురుసుగా ప్రవర్తించారు. తీవ్ర పదజాలంతో దూషించారు. దీంతో రాజాసింగ్ పై పోలీసులు సెక్షన్ 295 ఏ కింద కేసు నమోదు చేశారు.ఇక ఈ కేసును విచారించిన నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం రాజా సింగ్ కు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పుపై రాజాసింగ్ వెంటనే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న కోర్టు రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుపై హైకోర్టును ఆశ్రయిస్తానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు .
ప్రజా ప్రతినిధుల పై నమోదైన కేసుల విషయంలో కొనసాగుతున్న విచారణలు
ఇదిలా ఉంటే ప్రజా ప్రతినిధుల పై నమోదైన కేసుల విషయంలో నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ కొనసాగుతోంది గురువారం నాడు ఎంపీ బండి సంజయ్ మంత్రి మల్లారెడ్డి లపై వేరువేరుగా నమోదైన కేసులో నాంపల్లి స్పెషల్ కోర్టు విచారణ జరిపింది. కరీంనగర్ లో బండి సంజయ్ పై నమోదైన మూడు కేసులను న్యాయస్థానం కొట్టివేసింది. మంత్రి మల్లారెడ్డి పై నమోదైన కేసుల విచారణ ఇంకా కొనసాగుతోంది.