నరేంద్ర మోడీ మాకు ముందే చెప్పినా బాగుండేది: నారా రోహిత్, జగన్కే కౌంటరా?
ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు అంశంపై తమకు ముందుగా చెప్పినా బాగుండేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడి కొడుకు, ప్రముఖ నటుడు నారా రోహిత్ వ్యాఖ్యానించారు.
విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు అంశంపై తమకు ముందుగా చెప్పినా బాగుండేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడి కొడుకు, ప్రముఖ నటుడు నారా రోహిత్ వ్యాఖ్యానించారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దును ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.500, రూ.1000 నోట్ల రద్దును ఆయన ప్రకటించారు.
నోట్ల రద్దు ప్రకటన తదనంతర పరిణామాల పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబుకు నోట్ల రద్దు అంశం ముందుగానే తెలుసునని, అందుకే ఆయన తన హెరిటేజ్ షేర్లు అమ్ముకున్నారని ఆరోపించారు.
దీనిని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. తాజాగా ఇదే అంశంపై నారా రోహిత్ను అడిగారని తెలుస్తోంది.
పెద్ద నోట్ల రద్దు గురించి తమకు ముందే తెలిసిపోయిందని, మేం ముందుగా డబ్బులు మార్చేసుకున్నామని వార్తలు వచ్చాయని, నిజంగా అలా తెలిసినా బాగుండేదని ఎద్దేవా చేశారు. ఆ వ్యాఖ్యలు వైసిపి అధినేతకి, ఆ పార్టీ అధినేతకే తగులుతాయని అంటున్నారు.