సెటిలర్ అనే పదం తొలగించాలి: రేవంత్, తెలంగాణలో రాచరిక పాలన: కిషన్ రెడ్డి
హైదరాబాద్: సెటిలర్స్ అనే పదాన్ని నిషేధించాలని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
హైదరాబాద్లో టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి బుధవారం మాట్లాడుతూ తెలంగాణలో పుట్టిన ప్రతిబిడ్డ తెలంగాణ వారేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నేతలు మేము సెటిలర్లమని చెబుతూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
నాకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదని చెప్పిన రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎర్రవెల్లికే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కోదండరామ్, గద్దర్, విమలక్కలను సైతం టీఆర్ఎస్ సెటిలర్లను చేసిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
కోదండరామ్ లాంటి ఉద్యమకారులు కనిపించకుండా పోయారు: కిషన్ రెడ్డి
తెలంగాణ సీఎం కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రాచరిక పాలన, ఆత్మగౌరవానికి ఆడ్రస్ లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కోదండరామ్ లాంటి ఉద్యమకారులు కనిపించకుండా పోయారన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం మెప్పు కోసం కేసీఆర్ తపన పడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో కేజీ టు పీజీ, ఉచిత విద్యుత్ సహా ఏ హామీని నెరవేర్చలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గోదావరి నీటిని హైదరాబాద్కు తెచ్చామని బోగస్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.