నీట్ ప్రవేశ పరీక్ష ప్రారంభం: ఆలస్యమైతే అనుమతి నిరాకరణ
హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య విద్య ప్రవేశ పరీక్షల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష ఆదివారం నాడు దేశ వ్యాప్తంగా ప్రారంభమైంది. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్ధులను అనుమతించలేదు.
ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నీట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా సుమారు 13.26 లక్షల మంది అభ్యర్ధులు హజరౌతున్నారు.
నిమిషం ఆలస్యమైనా ఈ నీట్ ప్రవేశ పరీక్షకు అనుమతించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు రెండు లక్షల మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హజరౌతున్నారు. తెలంగాణలో ఖమ్మం, వరంగల్, హైద్రాబాద్లలో నీట్ ప్రవేశ పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖలలో కూడ ప్రవేశ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సారి నీట్ పరీక్షకు హజరయ్యే అభ్యర్ధులకు కఠినమైన నిబంధనలు విధించారు.అభ్యర్థులందరూ పొడుగు చేతుల దుస్తులు కాకుండా పొట్టి చేతులున్న దుస్తులనే ధరించి పరీక్షకు హాజరవ్వాలని సీబీఎస్ఈ స్పష్టీకరించింది. బురఖాలు ధరించి వచ్చిన విద్యార్థులను గంట ముందే లోనికి అనుమతించి తనిఖీలు చేశారు. సెల్ఫోన్లు, ఇయర్ ఫోన్స్, వాచీలు, చెవిదిద్దులు, ముక్కుపుడకలు ధరించి రావడాన్ని నిషేధించారు.