కేసీఆర్ తాతయ్యతో కలిసి వస్తా: కాళేశ్వరంలో చిన్నారి నేహాల్
కాళేశ్వరం: తెలంగాణ నీటి పారుదల శాఖ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన చిన్నారి నేహాల్ శుక్రవారంనాడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలను సందర్శంచాడు. నీటి పారుదల ప్రాజెక్టులపై అతని అవగాహనకు, ప్రసంగానికి ముగ్ధుడైన నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అతన్ని బ్రాండ్ అంబాసిడర్గా నియమించిన విషయం తెలిసిందే.
పిట్ట కొంచెం కూత ఘనం: ఐదేళ్ల యూకెజీ నేహాల్ ఇదీ...
తల్లిదండ్రులు రజని, హనుమంతరావులతో కలిసి అతను కాళేశ్వరం వచ్చాడు. తొలుత అతను స్వామివారిని దర్శింంచుకున్నాడు. ఆ తర్వాత కన్నెపల్లి పంపు హౌస్ వద్దకు వెళ్లాడు.
అతను గడగడ చెప్పేశాడు
వివిధ నిర్మాణాల గురించి కాళేశ్వరం బ్యారేజీ డిఈఈ ప్రకాశ్ నెహాల్ను అడిగారు. దానికి అతను గడగడ సమాధానం చెప్పాడు. కన్నెపల్లి పంపుహౌస్లో 17 పంపులుంటాయని, 11 పంపులతో నిత్యం రెండు టిఎంసిల నీటిని ఎత్తిపోస్తుందని, ఆరు పంపులను అత్యవసర సమయాల్లో వాడుతారని చెప్పాడు.
విద్యుచ్ఛక్తి కేంద్రం ఇలా..
కన్నెపల్లి పంప్ హౌస్ విద్యుచ్ఛక్తి కేంద్రం 440 మెగావాట్లతో ఉంటుందని, ప్రతి పంపు 40 మెగావాట్లతో నడుస్తుందని, అదే రకంగా కాలువ 13.2 కిలోమీటర్లు ఉంటుందని, దాని నుంి అన్నారం బ్యారేజీలో నీరు కలుస్తుందని నెహాల్ చెప్పాడు. అక్కడి నుంచి సుందిళ్ల, మిడ్ మానేరు, ఎల్లంపల్లికి నీరు రివర్స్ పంపింగ్ ద్వారా చేరుకుంటుందని చెప్పాడు.
రీడిజైనింగ్పై ఇలా..
తుమ్మిడి హట్టి ప్రాజెక్టును ఎందుకు రీడిజైన్ చేశారని జర్నలిస్టులు అడిగారు. నీటి లభ్యత తక్కువగా ఉండడం వల్ల కేసీఆర్ తాతయ్య కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపాడు. నిర్మాణాలు అనుకున్నదాని కన్నా వంద శాతం రెట్టింపులో జరగుతున్నాయని చెప్పాడు.
మళ్లీ ఎప్పుడు వస్తావంటే...
మళ్లీ కాళేశ్వరం ఎప్పుడు వస్తావని అడిగితే కెసిఆర్ తాతయ్యతో కలిసి తప్పకుండా వస్తానని నేహాల్ చెప్పాడు. తమ కుమారుడిని ఆలయాధికారులు, కాళేశ్వరం బ్యారేజీ ఇంజనీర్లు ఆహ్వానించిన తీరును మరిచిపోలేమని నేహాల్ తల్లి రజని అన్నారు.