పావులు కదుపుతున్న మోడీ ప్రభుత్వం: ఐటీ వలలో అక్రమార్కులు ఇలా చిక్కుతారు!
నల్లధనం ఉన్న వారు తమ డబ్బులను బ్యాంకులలో డిపాజిట్ చేయకుండా మోడీ ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇందుకోసం ఆదాయపన్ను శాఖ రంగంలోకి దిగింది.
న్యూఢిల్లీ: బ్లాక్ మనీ విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న రూ.14.50 లక్షల కోట్లలో నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు నల్లధనంగా బయటపడే అవకాశముందని ఆదాయపన్ను శాఖ (ఐటీ) అంచనా వేస్తోంది.
ఈ నేపథ్యంలో నల్లధనం ఉన్న వారు తమ డబ్బులను బ్యాంకులలో డిపాజిట్ చేయకుండా మోడీ ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇందుకోసం ఆదాయపన్ను శాఖ రంగంలోకి దిగింది.
బ్యాంకుల్లో కోట్లాది ఖాతాలు ఉన్నాయి. రద్దు ప్రకటన తర్వాత ఈ నెల పదో తేదీ నుంచి బ్యాంకు ఖాతాల్లో రూ.2.5లక్షలకు మంచి జమయ్యే ప్రతి ఖాతాదారుడికి ఆదాయ పన్ను శాఖ తాఖీదులు పంపించనుంది. పని భారాన్ని తగ్గించుకునేందుకు ఐటీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది.
ఇప్పటికే ఐటీ శాఖలో అందుబాటులో ఉన్న టెక్నాలజీతో నిర్దేశించిన నిబంధనలు ఉల్లంఘిస్తున్న పరిశ్రమలు, వ్యక్తులకు సంబంధించి తరచూ అప్రమత్తం చేస్తోంది. కంప్యూట్ ఆటోమేటిక్గా జనరేట్ చేసిన వివరాలను పరిశీలించి సోదాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచించుకుంటుంది.
తాజాగా నోట్ల రద్దుతో బ్యాంకుల ఖాతాల్లో జమ అవుతున్న మొత్తాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకించి టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటోంది. ఏయే బ్యాంకుల్లో ఎన్ని ఖాతాల్లో రూ.2.5లక్షలకు మించి డిపాజిట్ అవుతుందో బహిర్గతం చేసే పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చుకుంది.
ఇందులోను వివిధ రకాల క్యాటగిరీలుగా విభజించారు. రూ.10లక్షల లోపు జమైన ఖాతాల వివరాలు, రూ.10 లక్షల నుంచి 50 లక్షలు వరకు జమైన ఖాతాలు, రూ.50 లక్షల నుంచి రూ.కోటి జమ అయిన ఖాతాలు... ఇలా క్యాటగిరీలుగా విభజించారు. రూ. రెండున్నర లక్షలకు మించి ఖాతాల్లో జమ చేసిన ఖాతాదారులకు నోటీసులు జారీ చేయడంతో పాటు, ఆన్లైన్ ద్వారానే వివరణ కూడా తీసుకుంటుంది.