తెలంగాణలో కరోనా తీవ్రత ఇదీ: రెండున్నర లక్షలకు పైగా: 1,400 చేరువగా మరణాలు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రతలో చెప్పుకోదగ్గ మార్పులేవీ కనిపించట్లేదు. కొత్తగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇదివరకు నమోదైన రోజువారీ కేసులతో పోల్చుకుంటే వాటి సంఖ్య తగ్గినప్పటికీ.. అది నామమాత్రమే. స్వల్పంగా హెచ్చుతగ్గులు రికార్డవుతున్నాయి. కరోనా వైరస్ బారిన పడి కోలుకుంటోన్న వారి సంఖ్యలో మళ్లీ పెరగడం ఊరటనిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసులకు అనుగుణంగా చికిత్స పొందుతోన్న పేషెంట్ల సంఖ్యలో కదలికలు నెలకొంటున్నాయి.
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,196 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయిదుమంది మరణించారు. 1,745 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య రెండున్నర లక్షలను దాటేసింది. 2,53,651కు చేరుకుంది. ఇందులో డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,34,234గా నమోదైంది. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 1390కి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్గా ఉన్న కేసులు 18,027గా నమోదు అయ్యాయి. గృహాలు, ఇన్స్టిట్యూషనల్ ఐసొలేషన్లో 15,205 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
గ్రేటర్ హైదరాబాద్లో కొత్తగా 192 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆదిలాబాద్-12, భద్రాద్రి కొత్తగూడెం-81, జగిత్యాల-21, జనగామ-15, జయశంకర్ భూపాలపల్లి-11, జోగుళాంబ గద్వాల-4, కామారెడ్డి-26, కరీంనగర్-73, ఖమ్మం-42, కొమరంభీమ్ ఆసిఫాబాద్-4, మహబూబ్ నగర్-25, మహబూబాబాద్-10, మంచిర్యాల-24, మెదక్-18, మేడ్చల్ మల్కాజ్గిరి-101, ములుగు-21, నాగర్ కర్నూలు-18, నల్లగొండ-89, నారాయణపేట్-3, నిర్మల్-11, నిజామాబాద్-23, పెద్దపల్లి-24, రాజన్న సిరిసిల్ల-25, రంగారెడ్డి-121, సంగారెడ్డి-36, సిద్ధిపేట్-30, సూర్యాపేట్-26, వికారాబాాద్-21, వనపర్తి-9, వరంగల్ రూరల్-15, వరంగల్ అర్బన్-51, యాదాద్రి భువనగిరి-14 కేసులు నమోదు అయ్యాయి.
Recommended Video
తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల్లో 44,635 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 47,29,401కి చేరుకుంది. ప్రతి 10 లక్షల మంది జనాభాకూ 1,27,066 టెస్టులను నిర్వహించినట్లు పేర్కొన్నారు.