మోడీపై కేసీఆర్ వ్యాఖ్యల దుమారం: కేటీఆర్ను నిలదీసిన నిర్మల, ఇలానా అంటూ అసహనం
Recommended Video
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలి వానలా మారాయి. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసి వారి నిరసన తెలిపారు. అంతేగాక, గవర్నర్కు కూడా ఫిర్యాదు చేశారు.
కాగా, ప్రధానిపై ఒక సీఎం స్థాయి వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ నేతలు కూడా తప్పుపడుతున్నారు. తాజాగా, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కూడా కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
బాధించాయి
ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకవచనంతో చేసిన వ్యాఖ్యలు తనకెంతో బాధ కల్గించాయని కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇది దేశానికి బాధ కల్గించే విషయమని, దీనిపై సీఎం వివరణ ఇచ్చి ఉంటే బాగుండేదని అన్నారు.
ఇలా మాట్లాడతారా?
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు అలా మాట్లాడటం సరికాదని కేసీఆర్కు నిర్మలా సీతారామన్ హితవు పలికారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బంగారు లక్ష్మణ్ నాలుగో వర్ధంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
పద్ధతిగా మాట్లాడితేనే..
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘సిద్ధాంతపరంగా బేధభావాలున్నా.. వాటిపై విమర్శలకు పార్టీ, ఎవరికి వాళ్లు జవాబిస్తాం. కానీ చెప్పాల్సిన పద్ధతిలో చెబితే జవాబు ఇవ్వొచ్చు' అని అన్నారు.
కేటీఆర్ను నిలదీసిన నిర్మల
అంతేగాక, ‘బోయింగ్ - టాటా కార్యక్రమానికి ముందు కేసీఆర్ వ్యాఖ్యలపై కేటీఆర్ను నిలదీశా. అనుచిత వ్యాఖ్యల తర్వాత కార్యక్రమంలో పాల్గొంటే బాగుండదని కేటీఆర్కు చెప్పా. నేను రావాలా, వద్దా? అని కేటీఆర్ను ప్రశ్నించా. తన తండ్రి కేసీఆర్ పొరపాటున నోరు జారారని, ఆయన అలా మాట్లాడతారని తాననుకోనని కేటీఆర్ అన్నారు. చాలా వివరంగా సమాధానం ఇచ్చారు కాబట్టే నేను వచ్చా. సభా వేదికపైనా నేను కేటీఆర్ను నిలదీశా' అని నిర్మలా సీతారామన్ తెలిపారు. రెండ్రోజుల క్రితం ఓ బహిరంగ సభలో కేసీఆర్.. ప్రధానిని ఏకవచనంతో సంభోదించిన విషయం తెలిసిందే.