సోమారపు పంతం! నెగ్గిన అవిశ్వాసం: పదవిని కోల్పోయిన రామగుండం మేయర్, డిప్యూటీ మేయర్
పెద్దపల్లి: రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్ శంకర్లపై కార్పోరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో వారిద్దరూ పదవిని కోల్పోయారు. మేయర్, డిప్యూటీ మేయర్ టీఆర్ఎస్కు చెందినవారే అయినప్పటికీ టీఆర్ఎస్ తోపాటు బీజేపీ, కాంగ్రెస్కు చెందిన కార్పోరేటర్లు వీరిపై అవిశ్వాస తీర్మానం ఇచ్చారు.
26 మంది టీఆర్ఎస్ కార్పోరేటర్లు, 8 మంది కాంగ్రెస్, బీజేపీకి చెందిన ఒక కార్పోరేటర్.. ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణతో కలిసి అవిశ్వాసంలో పాల్గొనటం గమానర్హం. అవిశ్వాసంలో పాల్గొనవద్దని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసినప్పటికీ ఆ పార్టీ కార్పొరేటర్లు అవిశ్వాసానికి మద్దతుగా ఓటేశారు.
గురువారం ఉదయం 11గంటల నుంచి 11.30గంటల వరకు అవిశ్వాసానికి సంబంధించి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయగా క్యాంపులో ఉన్న కార్పోరేటర్లు ఎమ్మెల్యేతో కలిసి సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. 35 మంది కోరం ఉండటంతో అవిశ్వాసానికి సంబంధించిన ప్రక్రియను సంయుక్త పాలనాధికారి వనజాదేవీ పూర్తి చేశారు.
రాజకీయ సన్యాసం వద్దు!: సోమారపును బుజ్జగించిన కేటీఆర్
తొలుత కార్పోరేటర్ల సంతకాలు సేకరించి ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్లో మొత్తం 37 మంది అవిశ్వాసానికి మద్దతు ప్రకటించారు. దీంతో మేయర్, డిప్యూటి మేయర్లు ఇద్దరు తమ పదవులను కోల్పోవాల్సి వచ్చింది. మేయర్ పదవిని కోల్పోయారనే సమాచారం రావటంతో ఎమ్మెల్యే అనుయాయులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
కార్పోరేషన్లో 20 మంది కాంగ్రెస్ కార్పోరేటర్లకు పార్టీ అదిష్ఠానం విప్ జారీ చేసినప్పటికీ.. విప్ను దిక్కరించి 8మంది కార్పోరేటర్లు అవిశ్వాసానికి మద్దతుగా ఓటేశారు. మేయర్, డిప్యూటి మేయర్ ఇద్దరు కూడా సమావేశానికి హాజరు కాకపోవడంతో అవిశ్వాస ప్రక్రియ ఏకపక్షంగా సాగింది.
కాగా, గత కొంత కాలంగా మేయర్కు, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అవిశ్వాసం పెట్టి ఆయనను పదవి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. అవిశ్వాసం నెగ్గడంతో సోమారపు పంతం కూడా నెరవేరినట్లయింది. ఇంతకుముందు ఈ విషయంలోనే ఇటీవల రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించడంతో సోమారపును మంత్రి కేటీఆర్ బుజ్జగించిన విషయం తెలిసిందే.