పెట్రోల్ కొరత లేదు.. బంకుల్లో ఫుల్ స్టాక్! తేల్చిచెప్పిన ప్రభుత్వం
రెండు రోజులుగా హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద నెలకొన్న రద్దీపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్కు ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కొన్ని బంకుల్లో కనిపిస్తున్న 'నో స్టాక్' బోర్డులు కేవలం తాత్కాలికమేనని, ముందస్తుగా ఇంధనాన్ని నింపుకోవాలనే ఉద్దేశంతో వాహనదారులు భారీగా తరలిరావడమే దీనికి ప్రధాన కారణమని అధికారులు వెల్లడించారు.
రిఫైనరీల నుంచి ఇంధన సరఫరా నిరంతరాయంగా సాగుతోందని, ప్రజల అవసరాలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని పౌరసరఫరాల శాఖ పేర్కొంది. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మి బంకుల వద్ద క్యూ కట్టవద్దని కోరింది. ఇంధన కంపెనీలు డీలర్ల కోసం తెచ్చిన కొత్త చెల్లింపు విధానం (Advance Payment) వల్ల కొన్ని చోట్ల స్వల్ప జాప్యం జరిగి ఉండొచ్చని, అది సరఫరా కొరత కాదని అధికారులు వివరించారు.

తెలంగాణ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ కూడా ఈ విషయమై స్పందిస్తూ.. హెచ్పీసీఎల్, ఐవోసీఎల్, బీపీసీఎల్ కంపెనీల వద్ద తగినంత స్టాక్ ఉందని భరోసా ఇచ్చింది. వదంతుల కారణంగా వాహనదారులు ఒక్కసారిగా బంకులకు రావడం వల్ల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, సాధారణంగా కొనుగోలు చేస్తే ఎక్కడా ఇబ్బంది ఉండదని తెలిపింది.
నేడు సీఎం సమీక్ష..
రాష్ట్రంలో నెలకొన్న ఈ తాత్కాలిక ఇబ్బందులను తొలగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఇంధనం, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించనున్నారు.












Click it and Unblock the Notifications