కేసీఆర్ లక్ష్యం సమ్మెలు లేని తెలంగాణ! ప్రక్షాళన దిశగా పక్కాగా అడుగులు!
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దూకుడు పెంచబోతున్నారు. సీఎంకు తెలంగాణలో ఏ అంశంలోనూ ఎదురు లేకుండా పోతోంది. అన్నీ మంచి శకునాలే అన్నట్టు అన్ని రంగాల్లో పట్తింది బంగారం అవుతోంది. మరీ ముఖ్యంగా ఆర్టీసి కార్మికుల సమ్మె పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఏం చెప్పారో చివరికి అదే జరిగింది. ఆర్టీసి కార్మికుల సమ్మెకు ముగింపు పలకడం కాదు అది ముగిసిన అధ్యాయంగా సీఎం అభివర్ణించారు. హైకోర్ట్ అంశంలో కూడా విపరీత వ్యాఖ్యలు చేసారు. సమ్మె అంశంలో వాద ప్రతివాదాల నేపథ్యంలో "కోర్టు కొడ్తదా" అని వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 47 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులకు న్యాయం జరిగే విధంగా విచారణ సాగుతుందనుకుంటున్న తరుణంలో అకస్మాత్తుగా ఆర్టీసి కార్మికులు విస్మయానికి గురయ్యే తీర్పు వెల్లడించింది హైకోర్ట్.
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్: సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ
తిరుగులేని తెలంగాణ సీఎం.. కోర్టు తీర్పులు కూడా అనుకూలమే..
దీంతో మొదటి నుండి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సమ్మె పట్ల వినిపిస్తున్న వాదనే వాస్తవమనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. సమ్మె అంశం 47రోజులుగా కోర్టులో నలిగిన తర్వాత, కార్మికులకు సానుకూలంగా ఎలాంటి తీర్పు రాక పోగా ప్రభుత్వ వాదనకు బలం చేకూరేలా తీర్పు వెలువడింది. దీంతో బంతి మళ్లీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేతిలోకే వెళ్లినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా మంత్రివర్గ భేటీలో ప్రయివేటు రూట్ల అంశంలో తీసుకున్న నిర్ణయాన్ని కూడా కోర్టు సమర్ధించింది. దీంతో తెలంగాణలో చంద్రశేఖర్ రావుకు ఎదురులేదనే చర్చ జరుగుతోంది. కోర్టు ఇచ్చిన తీర్పులను ఎనర్జీ టానిక్ గా మార్చుకుని కొన్ని వ్యవస్ధలను ప్రక్షాళన చేస్తారనే చర్చ జరుగుతోంది.
ఆర్టీసి సమ్మె అంశంలో పైచేయి సాధించిన ప్రభుత్వం.. అయోమయంలో కార్మికులు..
సీఎం చంద్రశేఖర్ రావుకు రోజురోజుకూ బలోపేతమవుతున్నారు. గత 47 రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మొదట్లో ఇదే రూట్ల ప్రయివేటీకరణ నిర్ణయంపై హైకోర్టు సందేహాలను వ్యక్తం చేసింది. రెండు వారాలకు పైగా సుదీర్ఘ విచారణ కూడా చేపట్టింది. చివరగా రూట్ల ప్రైవేటీకరణపై వాదనలు విన్న కోర్టు కేబినెట్ నిర్ణయాన్ని సమర్థించింది. 5,100 రూట్ల ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద రీలీఫ్ దొరికినంత పనయ్యింది.
రూట్ల ప్రయివేటీకరణకు ఓకే.. సమర్ధించిన కోర్ట్...
అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 5,100 ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణను తప్పుపడుతూ, రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సుమారు రెండు వారాల పాటు దీర్ఘకాలిక వాదనలు ఈ అంశలో జరిగాయి. అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ప్రభుత్వ ఉత్తర్వు రాకముందు కేబినెట్ నిర్ణయాన్ని సవాల్ చేయొద్దని వాదించారు. ప్రభుత్వ వాదనలతో ధర్మాసనం ఏకీభవించి పిటిషనర్ వాదనను తోసిపుచ్చుతూ పిల్ను ధర్మాసనం కొట్టేసింది. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం రూట్ల విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది.
అన్ని మంచి శకునాలే.. కేసీఆర్ లక్ష్యం సమ్మెలు లేని తెలంగాణ ...
రూట్ల ప్రైవేటీకరణ విషయంలో జోక్యం చేసుకోమని కోర్టు తేల్చిచెప్పింది. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టలేమని వ్యాఖ్యానించింది. అయితే, పలు సూచనలు, షరతులు కోర్టు పేర్కొంది. ప్రైవేటీకరణ గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించే విషయంలో ప్రొసీజర్ను ఫాలో అవ్వాలని సూచించింది. మోటార్ వెహికల్ చట్టంలోని సెక్షన్ 102 ప్రకారం ఆ నిర్ణయాన్ని న్యూస్ పేపర్లలో యాడ్ ఇచ్చి, అభ్యంతరాల స్వీకరణకు 30 రోజుల గడువు ఇవ్వాలని చెప్పింది. ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయంపై ముందుకెళ్లాలని తెలిపింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఏజీ, రూట్ల ప్రైవేటీకరణపై ఇంకా గెజిట్ వరకు వెళ్లలేదని, ప్రొసీజర్ ప్రకారమే ముందుకు వెళ్తామని కోర్టుకు చెప్పారు.
అన్ని శాఖల్లో ప్రక్షాళన.. ఎదురులేని సీఎం గా కేసీఆర్...
ఐతే మొత్తం 47 రోజుల ఎపిసోడ్ లో కార్మికులు పైచేయి సాధించినట్టు కనిపించినా అంతిమ విజయం మాత్రం చంద్రశేఖర్ రావుకే దక్కిందనే చర్చ జరుగుతోంది. కార్మికులు చేస్తున్న సమ్మె చట్టవిరుద్దమని, సమ్మె విరమించి బేషరతుగా ఉద్యోగాల్లో చేరాలని చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. సీఎం మాటలు విన్నా ప్రయోజనం ఉండేదనే చర్చ ఉద్యోగుల్లో జరుగుతోంది. ఇదే అంశాన్ని ఆసరాగా చేసుకుని సమూల మార్పులకు చంద్రశేఖర్ రావు వ్యూహ రచన చేయడమే కాకుండా, తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా ప్రభుత్వ వ్యవస్థల్లో కూడా సీఎం వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది.