యువతి గ్యాంగ్రేప్లో షాకింగ్ ట్విస్ట్: ప్రియుడితో లాడ్జికెళ్లి..
మెదక్: మూడు రోజుల క్రితం మెదక్ జిల్లాలో.. విధులకు వెళ్తున్న ఆశా వర్కర్ పైన గుర్తు తెలియని వ్యక్తుల అత్యాచారం కేసు కొత్త మలుపు తిరిగింది. అసలు ఆ మహిళ పైన అత్యాచారం జరగలేదని, ఆమెనే తప్పుడుగా ఫిర్యాదు చేశారని పోలీసుల విచారణలో తేలింది.
ఆదివారం నాడు మెదక్ జిల్లా తూప్రాన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఈ కేసు విషయమై మీడియా సమావేశంలో మాట్లాడారు. సదరు మహిళ తనపై ఐదుగురు వ్యక్తులు సామూహిక లైంగికదాడి చేశారంటూ చేసిన ఫిర్యాదు ఓ కట్టు కథ అని తేల్చి చెప్పారు.
కౌడిపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాధిత మహిళ భర్తనుంచి విడిపోయింది. ఐదేళ్ల కూతురితో సహా తల్లి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో శివ్వంపేటం మండలం పెద్దగొట్టిముక్కతండాకు చెందిన బాల్సింగ్తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది.
శుక్రవారం బాధిత మహిళను బాల్సింగ్ తన ద్విచక్ర వాహనం పైన సంగారెడ్డికి తీసుకెళ్లాడు. అక్కడినుంచి సాయంత్రం పటాన్చెరు వెళ్లి భార్యాభర్తలమని చెప్పి గణపతి లాడ్జిలో దిగారు. శారీరకంగా ఒక్కటవడంతో మహిళకు తీవ్ర రక్తస్రావమైంది.
దీంతో భయాందోళన చెందిన బాల్సింగ్ ఆమెను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాత్రి పదకొండున్నర గంటలకు వదిలి పెట్టి వెళ్లాడు. విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు ఆసుపత్రిలో.. తన పైన అత్యాచారం జరిగినట్లు తెలిపింది. ఫోన్కాల్స్ ఆధారంగా ఫిర్యాదు కట్టుకథ అని పోలీసులు తేల్చారు. బాల్సింగ్ను ఆదివారం అరెస్ట్ చేశారు. మహిళపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.