ఏసీ గదులు వీడట్లే... ఆ అధికారులపై సీఎం రేవంత్ హాట్ కామెంట్స్
కొందరు ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ రచించిన 'లైఫ్ ఆఫ్ ఏ కర్మ యోగి- మెమైర్ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్' పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్లోని బేగంపేటలో జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్తగా ఐఏఎస్గా వచ్చే వాళ్లకు గోపాలకృష్ణ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
అధికారులు క్షేత్రస్తాయిలో ఎంత తిరిగితే అంత మంచిదని అన్నారు. కానీ, ఇప్పటి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లేందుకు సుముఖంగా లేరని, ఏసీ గదులను వీడేందుకు ఇష్టపడట్లేదని వ్యాఖ్యానించారు.

కొత్త ఐపీఎస్లు యూనిఫాంలు వేసుకుని సివిల్ పంచాయతీలు చూసుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఏసీ రూమ్ నుంచి బయటికి రావడానికి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇష్టపడటం లేదన్నారు. జనంలోకి రండి అంటే రావడం లేదని అన్నారు. అధికారుల ఆలోచనా విధానంలో మార్పు రావాలన్నారు.
నిబద్ధత కలిగిన అధికారులను గుర్తించి ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. పాలకులు ఎన్ని పాలసీలు చేసినా.. అమలు చేసేది అధికారులేనని అన్నారు. క్షేత్రస్తాయిలో బాగా పనిచేసిన వారిని ప్రజలూ గుర్తుంచుకుంటారన్నారు. మనకున్న జ్ఞానం, అధికారం పేదలకు ఉపయోగపడాలి అని సీఎం రేవంత్ అన్నారు.












Click it and Unblock the Notifications