వైఎస్, చంద్రబాబుల్లా కాదు : వన్ అండ్ ఓన్లీ సీఎం, హ్యాట్సాఫ్ టు కేసీఆర్
1993 నుంచి 2016 వరకు 23 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ. ఎంతమంది సీఎంలు మారినా.. వాళ్లిచ్చిన వాగ్దానాలన్ని మాటలకే పరిమితమయ్యాయి. కంపెనీ అవసరాల కోసం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా..! అటువైపు తొంగిచూసిన నాథుడే లేడు. కానీ, సీఎంగా కేసీఆర్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఒకే ఒక్క విజ్ఞప్తితో స్వయంగా ఆయనే ఆ కంపెనీని సందర్శించారు. కంపెనీ వినతుల పట్ల హామీలు ఇవ్వడమే కాదు, యుద్ద ప్రాతిపదికన పనులకు అధికారులను పురమాయించారు. ఫలితంగా.. 23 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆ కంపెనీకి నీళ్లొచ్చాయి. అదే శాంతా బయోటెక్స్ కంపెనీ.
ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్న వ్యక్తిగా, మాట తప్పని సీఎంగా కేసీఆర్ చేసిన సహాయంపై ఓ లేఖ రాశారు శాంతా బయోటెక్స్ ఎండీ వరప్రసాద్. లేఖలో ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం.. 1993 లో మేడ్చల్ పరిధిలో కంపెనీని ప్రారంభించినప్పుడు అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఇన్ ఫ్రా స్ట్రక్చర్ సదుపాయాలు కల్పించలేదన్నారు. దీంతో సొంత ఖర్చులతో ఎలక్ట్రిక్ లైన్స్, అప్రోచ్ రోడ్, కమ్యూనికేషన్ వైర్స్ తదితర సదుపాయాలను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
అయితే నీటి అవసరాలను సొంతంగా సమకూర్చుకునే పరిస్థితి లేదు కాబట్టి.. 1993 నుంచి కంపెనీ నీటి అవసరాల కోసం ఆయా ప్రభుత్వాలను బతిమాలుతూనే ఉన్నామని, చంద్రబాబు, వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్, ఇలా ఎవరు మారినా.. తమ వినతులను మాత్రం లెక్క చేయలేదని లేఖలో పేర్కొన్నారు.
కాగా.. గత సంవత్సరం జనవరి నెలలో కేసీఆర్.. కంపెనీని సందర్శించడంతో తమ బాధలన్ని తీరిపోయాయని, ఇప్పటివరకు ఏ సీఎం స్పందించని రీతిలో ఆయన యుద్ద ప్రాతిపదికన నీటి వసతిని కల్పించే ఏర్పాటు చేశారని కొనియాడారు. కేసీఆర్ ను అనన్య సామాన్యులుగా కీర్తించిన ఎండీ వరప్రసాద్ ఆయనకు ఆత్మీయ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ లేఖ రాశారు.