ఆ మూడు ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు నోటిఫికేషన్..! 31న ఎన్నిక.. జూన్ 3న ఫలితాలు..!!
హైదరాబాద్ : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. స్థానిక సంస్థల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రంగారెడ్డి, వరంగల్, నల్గొండ స్థానాలకు ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తోంది. నామినేషన్ల దాఖలుకు 14వతేదీ వరకు వారంరోజుల గడువు ఇచ్చింది. పట్నం నరేందర్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, పార్టీ మారిన కొండా మురళీధర్రావు పదవికి రాజీనామా చేయడం వల్ల స్థానిక సంస్థల కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించనున్నారు.

రాజీనామాచేసిన ఈ ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం 2022 జనవరి నాలుగో తేదీ వరకు ఉన్నది. ప్రస్తుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం జూలై రెండు వరకు ఉన్నందున.. ఈ ఉపఎన్నికల్లో వారు ఓటువేయడానికి అర్హులు. కొత్తగా ఎన్నికయ్యే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు ఈ ఎన్నికల్లో ఓటేసే అవకాశం ఉండదు. ఈ మూడు స్థానాలకు మంగళవారం నుంచి మే 14 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మే 15న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు మే 17 గడువుగా పేర్కొన్న ఎన్నికల కమిషన్.. అవసరమైతే ఈ నెల 31న ఎన్నిక నిర్వహించి జూన్ 3న ఫలితాలు విడుదల చేయనున్నది.












Click it and Unblock the Notifications