కెసిఆర్! ఎన్టీఆర్ ఘాట్ను చూడు: లక్ష్మీపార్వతి, ఆయన భిక్షే: బాలకృష్ణ అసహనం
హైదరాబాద్: భాగ్యనగరంలోని ఎన్టీఆర్ ఘాట్ పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి సోమవారం నాడు సూచించారు. ఎన్టీఆర్ 20వ వర్ధంతి సందర్భంగా సోమవారం హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆమె నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్టీఆర్ ఘాట్ పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావులు దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు ప్రజల కోసం అహర్నిషలు కృషి చేసిన ఎన్టీఆర్కు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సరైన గౌరవం ఇవ్వడం లేదన్నారు. ఇద్దరికీ (కెసిఆర్, చంద్రబాబు) రాజకీయ ఊపిరి ఇచ్చారని, వారు ఈ ఘాట్ పైన శ్రద్ధ పెట్టాలన్నారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ, టిడిపి యువనేత నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద కనీస ఏర్పాట్లు చేయకపోవడంపై బాలకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలు లేకపోవడం సరికాదన్నారు.
చాలా పార్టీలలోని ముఖ్య నేతలకు భిక్ష పెట్టింది ఎన్టీఆరే అన్నారు. అలాంటి నేత ఘాట్ వద్ద సరైన సౌకర్యాలు లేకపోవడం బాధాకరమని చెప్పారు.
దేశానికి, రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలు అమోఘమన్నారు. పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారన్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మార్పులు ఇతర రాష్ట్రాల్లోను అనుసరించారన్నారు. ఆయన వల్ల ఎందరో మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారన్నారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద హరికృష్ణ, కల్యాణ్ రామ్, ఎన్టీఆర్, భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, కేంద్రమంత్రి సుజనా చౌదరి, టిడిపి నేతలు ఎల్ రమణ, రేవంత్ రెడ్డి, సినీ దర్శకుడు వైవిఎస్ చౌదరి తదితరులు ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు.
ఖమ్మం జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ
ఖమ్మం జిల్లా జూలురుపాడు మండలం గుంటిపూడిలో సోమవారం నాడు ఎమ్మెల్యే వెంకట వీరయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఖమ్మం జిల్లాలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కొత్తగూడెంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.