కరోనా వైరస్.. తెలంగాణలో మరో పాజిటివ్.. 19కి చేరిన కేసులు
తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది.ఇటీవలే ఇండోనేషియా నుంచి కరీంనగర్కు వచ్చిన 60 ఏళ్ల వృద్దుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19కి చేరుకుంది. శుక్రవారం(మార్చి 20) ఉదయమే కొత్తగా రెండు పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వీరిలో ఒకరు ఇటీవల లండన్ నుంచి హైదరాబాద్ వచ్చిన 18 ఏళ్ల యువతి కాగా.. మరొకరు ఇండోనేషియా నుంచి వచ్చిన 27 ఏళ్ల యువకుడు.
ఈ నెల 14న కరీంనగర్లో మతపరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇండోనేషియా నుంచి 10 మంది బృందం ఇక్కడికి వచ్చారు. ఢిల్లీ నుంచి రామగుండం వరకు ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణించిన వీరు.. అక్కడి నుంచి కరీంనగర్ చేరుకున్నారు. ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై వీరి ఆచూకీ తెలుసుకుని వైద్య పరీక్షలు జరపగా.. ఏడుగురికి పాజిటివ్ ఉన్నట్టు తేలింది. తాజాగా మరో ముగ్గురికి కూడా కరోనా సోకినట్ట నిర్దారణ అయింది. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రత్యేక ఐసోలేషన్ సెంటర్లో వీరికి చికిత్స అందిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన కేసులన్నీ విదేశాల నుంచి వచ్చినవారివే కావడం గమనార్హం.
Recommended Video
మరోవైపు కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే విద్యా సంస్థలు,మాల్స్,థియేటర్స్,జిమ్స్,పబ్స్ మూసివేశారు. హైకోర్టు ఆదేశాలతో పదో తరగతి పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని.. సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. కరోనా గురించి తీవ్ర ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వ్యక్తిగత శుభ్రత ద్వారా దీన్ని ఎదుర్కోవచ్చునని చెబుతున్నాయి.