నగరంలో కొనసాగుతున్న ర్యాపిడ్ ఫీవర్ సర్వే.!ఆకస్మిక తనిఖీ చేసిన సీఎస్ సోమేష్ కుమార్.!
హైదరాబాద్ : ప్రభుత్వం నిర్వహిస్తున్నరాపిడ్ ఫీవర్ సర్వేకు అనూహ్య స్పందన వస్తోంది. కోవిడ్ లక్షణాలతో ఇబ్బందిపడుతున్న వారిని స్వయంగా ఆసుపత్రులకు తరలించడం లేదా మందులు అందజేయడం బృహత్కర కార్యక్రమంగా నగర ప్రజలు అభివిర్ణిస్తున్నారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ లో చేపట్టిన ఫీవర్ సర్వేలో భాగంగా నేడు గురువారం నాడు 47,582 ఇళ్లలో సర్వే నిర్వహించారు. జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన 700 బృందాలు నేడు ఇంటింటికి తిరిగి జ్వరం, కోవిడ్ లక్షణాలున్నవారి సర్వేను పెద్ద ఎత్తున చేపట్టాయి. దీంతో పాటు స్వల్ప జ్వర లక్షణాలు ఉన్న వారు వెంటనే సమీపంలోని ఆసుపత్రుల్లో పరీక్ష చేసుకొని, ఉచితంగా అందచేసే మందులను వాడాలన్నారు సోమేశ్ కుమార్.
ఒక్కో బృందంలో ఒక ఏ.ఎం.ఎం, ఆశ వర్కర్, జీహెచ్ఎంసీ వర్కర్ తో కూడిన సభ్యులు ఇంటింటికి తిరిగి సర్వే ను చేపట్టారు. ఈ బృందాలు జ్వరం తో ఉన్న వారి వివరాలను సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు జ్వర కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది యాంటీ లార్వా ద్రావకాన్ని పిచికారి చేస్తున్నారు. నగరంలో ప్రతీ బస్తి దవాఖాన, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఇతర దావఖానాలలో కోవిడ్ అవుట్ పేషంట్ కు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో నేడు కూడా అన్ని ఆసుపత్రుల్లో18,765 మందికి జ్వర పరీక్షలు నిర్వహించారు. కాగా జిహెచ్ఎంసి కాల్ సెంటర్ ద్వారా 130 మందికి కోవిడ్ సంబంధిత సలహాలు, సూచనలు వైద్యులు అందజేశారు.