కాంగ్రెస్ Vs కేసీఆర్ "సంక్షేమ" యుద్దం - అక్కడే ట్విస్ట్, కలిసొచ్చేదెవరికి..!!
తెలంగాణలో ఎలక్షన్ హీట్ పెరిగిపోతోంది. కాంగ్రెస్ గ్యారంటీ కార్డుతో ఈ సారి ఎన్నికల్లో విజయం ఖాయమనే ధీమాతో ఉంది. కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ బ్రహ్మస్రం సంధించారు. రాజకీయంగా కాంగ్రెస్ కంటే మెరుగైన సంక్షేమ హామీలతో మేనిఫెస్టో ప్రకటించారు. తమ పథకాలను కేసీఆర్ కాపీ కొట్టారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పుడు సంక్షేమ ఓట్ బ్యాంక్ పైన రెండు పార్టీలు గురి పెట్టాయి. అసలు ఈ రెండు పార్టీల పోటా పోటీ సంక్షేమంతో కలిసొచ్చేదెవరికి. గెలుపు దక్కేదెవరికి.
సంక్షేమం చుట్టూ రాజకీయం:తెలంగాణ ఎన్నికల యుద్దం ఇప్పుడు సంక్షేమ ఓట్ బ్యాంక్ చుట్టూ తిరుగుతోంది. ప్రధానంగా మహిళా ఓట్ బ్యాంక్ పైన ప్రధాన పార్టీలు గురి పెట్టాయి. కాంగ్రెస్ నేత సోనియా ఆరు పథకాలతో తెలంగాణ ప్రజలకు పార్టీ గ్యారంటీ కార్డు ప్రకటించారు. వీటినే తమ ఎన్నికల అస్త్రంగా కాంగ్రెస్ భావిస్తోంది. ఈ హామీలే తమకు అధికారం తెచ్చి పెడతాయనే నమ్మకంతో ఉంది. సరిగ్గా అక్కడే కేసీఆర్ కీలక అడుగు వేసారు. కాంగ్రెస్ హామీలను కంటే అంతకుమించిన సంక్షేమం అందిస్తామని ముందుకొచ్చారు. కీలక హామీలతో పార్టీ మేనిఫెస్టో ప్రకటించారు. అందులో ప్రధానంగా అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల గౌరవ భృతి తో పాటుగా అర్హులైనవారికి రూ.400కే గ్యాస్ సిలిండర్లు ఇస్తామనేది ఇప్పుడు కాంగ్రెస్ కు మింగుడు పడని హామీగా మారుతోంది.

కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్:ఇక, ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్లను ఏటా రూ.500 చొప్పున రూ.5 వేలకు పెంచుతామని కేసీఆర్ ప్రకటించారు. అదే విధంగా దివ్యాంగుల పెన్షన్లు ఏటా రూ.300 చొప్పున రూ.6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. రైతుబీమా తరహాలో పేదలకు కేసీఆర్ బీమా పథకం ప్రకటించారు. తెల్లరేషన్కార్డుదారులకు రూ.5 లక్షల కేసీఆర్ బీమా ఇస్తామని వెల్లడించారు. కేసీఆర్ బీమా ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టత ఇచ్చారు.
కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికీ ధీమా పేరుతో అమలు చేస్తామని చెప్పారు. రైతుబంధు మొత్తం దశలవారీగా రూ.16 వేలకు పెంపు పైనా హమీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రకటించిన పథకాల అమలుకు రాష్ట్ర బడ్జెట్ సరిపోదని బీఆర్ఎస్ ఇప్పటి వరకు చెబుతూ వచ్చింది. ఇప్పుడు మేనిఫెస్టో ప్రకటించింది. ఇదే కాంగ్రెస్ ప్రశ్నించేందుకు అవకాశంగా మారింది.

ప్రజలు ఎవరి వైపు:కాంగ్రెస్ తమ పథకాలనే కాపీ కొట్టారని..తమను విమర్శించిన వారు ఎలా అమలు చేస్తారని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడే అసలు విషయం బీఆర్ఎస్ నేతలు బయట పెట్టారు. తాము హామీ ఇచ్చిన పథకాలు దశల వారీగా అమలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కారణంగా అక్కడ కొత్తగా నిర్ణయాలు..అభివృద్ధి కోసం నిధులు కేటాయించలేకపోతున్నామంటూ అక్కడి మంత్రులు చెబుతున్న విషయాన్ని గులాబీ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.
తాము కాంగ్రెస్ లాగా అన్ని ఒకేసారి అమలు చేస్తామని చెప్పటం లేదని స్పష్టం చేస్తున్నారు. దాదాపు పదేళ్లుగా అధికారంలో ఉన్నామని..రాష్ట్ర అర్ధిక పరిస్థితి గురించి పూర్తి అవగాహనతోనే ఎలా అమలు చేయలో కసరత్త చేసామని చెబుతున్నారు. అదే ప్రజలకు వివరిస్తామంటున్నారు. గతంలో కాంగ్రెస్ లో రూ 2 లక్షల రైతు రుణ మాఫీ అని చెప్పినా ప్రజలు నమ్మలేదని గుర్తు చేస్తున్నారు. దీంతో..ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న వాదన..కాంగ్రెస్ హామీల నడుమ ప్రజలు ఎవరి వైపు నిలుస్తారనేది వేచి చూడాల్సిందే












Click it and Unblock the Notifications