అల్లరి చేస్తున్నాడని కొడుకును చితకబాదిన తల్లిదండ్రులు
సంగారెడ్డి: మెదక్ జిల్లాలోని పటాన్ చెరు మండలంలో తల్లిదండ్రులే తమ కుమారుడి పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించారు. పిల్లాడు అల్లరి చేస్తున్నాడని కన్న కొడుకని కూడా చూడకుండా తల్లిదండ్రులు చితకబాదారు. వాళ్లు కొట్టిన దెబ్బలకు ఆ పసివాడి కళ్లు, ముఖం కమిలిపోయాయి.
దెబ్బలు గట్టిగా తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఈ సంఘటన చూసి చలించిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మెదక్ జిల్లా పటాన్చెరు మండలం శాంతినగర్కు చెందిన రాధా, శివకుమార్ దంపతులు తమ మూడేళ్ల చిన్నారిని అమానుషంగా కొట్టారు. పోలీసులు వారిద్దరి పైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తి ఆత్మహత్య
కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా రామగుండం మండలం బసంత్నగర్లో గురువారం చోటు చేసుకుంది. స్తానికంగా నివాసం ఉంటున్న వడ్డేపల్లి శ్రీనివాస్ (35) సిమెంట్ కర్మాగారంలో పనిచేస్తున్నాడు.
గత కొద్ది రోజులుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ స్థితిలో గురువారం తెల్లవారు జామున అందరూ నిద్రపోతున్న సమయంలో అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.