చిత్రం: వారి కడుపుల్లోంచి బంగారం కక్కించారు
హైదరాబాద్: బంగారాన్ని తేవడానికి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కొత్త కొత్త మార్గాలను కనిపెడుతున్నారు. లగేజీతో తమను పట్టుకుంటారని భావించిన నలుగురు ప్రయాణికులు బంగారాన్ని మింగి తరలించాలని ప్రయత్నించారు. అయితే వారు కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు.
కస్టమ్స్ అధికారులు గుర్తించి నలుగురు ప్రయాణికుల నుంచి సుమారు 735 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన నలుగురు వ్యక్తులు దుబాయ్ నుంచి సోమవారం శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు.
వారిపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే వారి కడుపులో బంగారం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. వైద్యుల పర్యవేక్షణలో వారి కడుపులోని బంగారాన్ని బయటకు తీశారు. ఒక్కొక్కరి వద్ద 150 నుంచి 200 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు విమానాశ్రయం అధికారులు తెలిపారు.