కొండా సురేఖ వ్యాఖ్యలపై పవన్,బాలకృష్ణ మౌనం వెనుక..!!
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. రాజకీయ..సినీ ప్రముఖులు సురేఖ వ్యాఖ్యల పైన మండిపడ్డారు. టాలీవుడ్ ప్రముఖులు సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. దీంతో, సురేఖ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటున్నట్లు చెప్పారు. కానీ, సినీ ప్రముఖులు శాంతించలేదు. అయితే ఈ వ్యవహారం పైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్, బాలకృష్ణ స్పందించకపోవటం చర్చనీయాంశంగా మారింది. పవన్ ఎందుకు స్పందించ లేదు. ఏం జరుగుతోంది.
సురేఖ వ్యాఖ్యలతో
అక్కినేని కుటుంబం, నటి సమంత పైనా అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై సినీ ప్రముఖులు భగ్గుమన్నారు. దాదాపుగా టాలీవుడ్ ప్రముఖులందరూ ఆ ఇష్యూపై స్పందించారు. తమిళ, మలయాళ ఇండస్ట్రీలతోపాటు బాలీవుడ్ సినీ తారలు సురేఖ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సినీ తారల జోలికి రావొద్దంటూ హెచ్చరించారు. చిరంజీవితోపాటు మెగా ఫ్యామిలీ తారలందరూ స్పందించినా.. పవన్ కళ్యాణ్ స్పందించలేదు. అత్తారింటికి దారేది లాంటి చిత్రాల్లో తన సహనటిగా ఉన్న సమంతపై వాఖ్యలను ఆయన ఖండిస్తారేమోనని వారంతా ఆశించారు.

స్పందించని పవన్
హైడ్రా కూల్చివేతలపై స్పందించిన తరహాలోనే దీనిపైనా స్పందిస్తారని అందరూ భావించారు. రాజకీయ నేతగా కాకపోయినా..సినీ ప్రముఖుడిగా రియాక్ట్ అవుతారని అనుకున్నారు. తిరుపతిలో జరిగిన వారాహి సభలో నైనా ఆయన ఈ అంశంపై మాటవరసకైనా మాట్లాడుతారేమోనని భావించారు. సాధారణంగా మహిళా అభ్యున్నతి, గౌరవమర్యాదల గురించి పవన్ గట్టిగా స్పందిస్తారు. కానీ, ఈ విషయంలో మాత్రం ఎక్కడా మాట్లాడలేదు. ఆయన మౌనంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కొండా సురేఖ వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ ఘాటుగా స్పందించారు. నేరుగా మంత్రి పేరును ప్రస్తావిస్తూ దీటుగా సమాధానమిచ్చారు.
బాలయ్య మౌనం వెనుక
నందమూరి బాలకృష్ణ సురేఖ వ్యాఖ్యలను ఎక్కడా ఖండించలేదు. నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అక్కినేని కుటుంబం పై చేసిన వ్యాఖ్యలపై స్పందించకపోవడం ఏమిటనే చర్చ జరుగుతోంది. రేవంత్ తో ఉన్న సఖ్యత వల్లే బాలకృష్ణ స్పందించలేదా.. లేక ఏఎన్నార్ కుటుంబంతో ఉన్న గ్యాప్ కారణంగానే మాట్లాడలేదా అనే చర్చ సోషల్ మీడియాలో కొనసాగుతోంది. అయితే, ఈ వివాదానికి ముగింపు పలకాలని టీపీసీసీ చీఫ్ మహేష్ టాలీవుడ్ ను కోరారు. కానీ, ఇప్పటికీ సురేఖ వ్యాఖ్యల పైన రగడ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications