కేసీఆర్పై అదొక్కటే అసంతృప్తి, రాజకీయంగా చిరంజీవి ప్రత్యర్థే: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థ పాలన అందిస్తున్నారని టాలీవుడ్ అగ్రనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలైన నేపథ్యంలో ఆదివారం ఒక టీవీ చానెల్తో పవన్ మాట్లాడారు.
ఉమ్మడి హైదరాబాద్లోని సెటిలర్స్కు సమప్రాధాన్యమిస్తూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నదని ప్రశంసించారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సెటిలర్ల పట్ల వివక్షను రేకెత్తించే ఒక్క సంఘటన కూడా చోటుచేసుకోలేదని అన్నారు. అయితే ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడమే కాస్తంత అంసతృప్తిగా ఉందని అన్నారు.
"ఒక్కోసారి నాకు ఇబ్బందిగా అనిపించేది ఏంటంటే, మిగతా పార్టీల ఎమ్మెల్యేలను కలుపుకోని పోవడం... నిజంగా అది అంత అవసరం లేదుకదా? అనిపిస్తుంది. నాకు అదొక్కటే చంద్రశేఖరరావు ఆలోచనా విధానంపై అసంతృప్తి. మీరు కలుపుకొని వెళ్లడం... బయట నేను ఎక్కడ వింటున్నాగానీ పాలన బాగుందనే అంటున్నారు. నేను ప్రత్యక్షంగా చూడలేదుగానీ, నాకు తెలిసింది. కాకపోతే, మిగతా అన్ని పార్టీల నుంచి రావడం... అది ఎంతవరకూ అడ్వాంటేజ్ అన్నది నాలో ఆలోచన పుట్టిస్తోంది. ఎందుకంటే... ఉద్యమ స్వరూపంతో వచ్చిన పార్టీ. అలాంటి పార్టీకి కూడా ఇలాంటి విధానాలు అవసరమా? ఈ వేరే పార్టీ ఎమ్మెల్యేలను తీసుకురావడాలు... వినూత్నంగా పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీకి ఇది అవసరం లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం" అన్నారు.
సీఎం కేసీఆర్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నాయకత్వ పటిమ బాగుందని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని పవన్ తెలిపారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. తన అన్న చిరంజీవితో రాజకీయంగా అభిప్రాయ భేదాభిప్రాయాలున్నాయే తప్ప వ్యక్తిగతంగా కాదని చెప్పారు.
రాజకీయపరంగా ఆయన ప్రత్యర్థేనని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీలో మాట్లాడేందుకు అనేక పరిమితులుండేవని, జనసేనలో ఏం మాట్లాడినా అందుకు తనదే బాధ్యత అని పేర్కొన్నారు. చిరంజీవి పార్టీ మారే అవకాశం లేదని, ఆయన పూర్తిస్థాయి కాంగ్రెస్ వాది అని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానని ప్రకటించారు. టన్నుల కొద్ది మాట్లాడటం కంటే ఔన్సుల కొద్ది పనిచేయడం ముఖ్యమని అన్నారు. వ్యక్తిగతంగా రాజకీయ పార్టీ పెడతానని ఎప్పుడూ అనుకోలేదని, అయితే రాష్ట్ర విభజన అందుకు కారణమైందని పవన్ అన్నారు.
నేను రాజకీయ నాయకుణ్ణి కాదు. కేవలం నటుడిని మాత్రమే. నటులు సాంస్కృతిక వారధులుగా ఉండాలనేది నా నమ్మకం అని తెలిపారు. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడం సరికాదని అన్నారు. దేశ సమగ్రతకు భంగం వాటిల్లకూడదని చెప్పిన పవన్... ప్రజల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తకూడదు, విద్వేషాలు ఉండకూడదన్నదే నా సిద్ధాంతం అన్నారు.