పవన్ కల్యాణ్ చిచ్చు: ఇక తెగదెంపులే: టీఆర్ఎస్ అభ్యర్థినికి మద్దతు పట్ల అమిత్ షా సీరియస్
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ-జనసేన మధ్య పొత్తు వ్యవహారం మూణ్నాళ్ల ముచ్చట్లాగే కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు పార్టీల మధ్య గత ఏడాది కుదిరిన సీట్ల సర్దుబాటు..అదే స్థానిక సంస్థల ఎన్నికలతోనే పరిసమాప్తి అయ్యే అవకాశాలు నెలకొన్నాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ మీద చేసిన వ్యాఖ్యల ప్రభావం ఈ రెండింటి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు దెబ్బతినడానికి కారణమైనట్లు చెబుతున్నారు. శాసన మండలి ఎన్నికల పోలింగ్ రోజు నాడే- టీఆర్ఎస్ అభ్యర్థిని సురభి వాణీదేవికి పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించడం.. ఇక తెగదెంపులేననే సందేశాన్ని పంపించినట్టయింది.
బీజేపీపై పవన్ కల్యాణ్ అసంతృప్తి: ముప్పావల కోడి: అక్కడ ఒంటరిపోరు: బ్రేకప్ చెప్పినట్టేనా?
పవన్ ఏం చెప్పారు..?
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఉదయం పవన్ కల్యాణ్.. జన సైనికులతో సమావేశమయ్యారు. తెలంగాణలో బీజేపీ నేతల వ్యవహారాన్ని ఎండగట్టారు. జాతీయ స్థాయిలో బీజేపీ నేతలు.. తమను మిత్రపక్షంగా గుర్తిస్తున్నప్పటికీ రాష్ట్రానికొచ్చేసరికి పరిస్థితులు తలకిందులవుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ నేతలెవరూ తమను గుర్తించట్లేదని అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. అందుకే- బీజేపీ అభ్యర్థికి బదులుగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తోన్నసురభి వాణీదేవికి ఓటు వేయాలని సూచించినట్లు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఎన్నికల్లో ఒంటరిపోరు..
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్కు నిర్వహించబోయే ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీ నేతలతో ఎలాంటి పొత్తు గానీ, వారికి అండగా నిలిచేది లేదని ఉండబోదని తేల్చేశారు. తమను గౌరవించని వారికి అండగా నిలబడాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. తెలంగాణ జనసేన పార్టీ శ్రేణుల గౌరవం తనకు ముఖ్యమని, అది దక్కనప్పుడు వారితో కలవాల్సిన పని లేదని అన్నారు. అందుకే ఎమ్మెల్సీ పట్టభద్ర ఎన్నికల్లో పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణి దేవి గారికి మద్దతు ఇచ్చామని, ఆమె గెలవాలని కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ చెప్పారు.
మిత్రధర్మం తప్పిన పవన్ కల్యాణ్..
ఈ వ్యవహారం కాస్తా చిలికి చిలికి గాలీవానగా మారుతోంది. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్ పట్ల ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఓ పనికిమాలిన నాయకుడంటూ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. పవన్.. ఓ లుచ్ఛా అంటూ బండి సంజయ్ మండిపడ్డారని తెలుస్తోంది. ఆయన వైఖరి, వ్యవహార శైలి పట్ల పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామని టీ బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ మిత్రధర్మాన్ని పాటించట్లేదని, మిత్రుడిగా ఉంటూనే మోసం చేశారంటూ మండిపడుతున్నారు.
అమిత్ షా సీరియస్..
పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు, కరడు గట్టిన ప్రత్యర్థి టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడాన్ని బీజేపీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారని అంటున్నారు. దీనిపై ఓ నివేదిక పంపించాల్సిందిగా ఆయన తెలంగాణ బీజేపీ నేతలకు సూచించినట్లు సమాచారం. దీని మీద సంతృప్తికరమైన వివరణ కోసం పవన్ కల్యాణ్కు షోకాజ్ నోటీసులు జారీ చేయొచ్చని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ఇచ్చే వివరణ మీదే ఈ రెండు పార్టీల పొత్తు భవిష్యత్తు కొనసాగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
తిరుపతితోనే బెడిసి కొట్టిందా?
తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక వ్యవహామే పవన్ కల్యాణ్.. బీజేపీపై అసంతృప్తిని వ్యక్తం చేయడానికి కారణమైందని వాదనలు వినిపిస్తోన్నాయి. జన సైనికుల అభిప్రాయాల మేరకు తిరుపతిలో తమ పార్టీ అభ్యర్థిని పోటీకి దింపాలని నిర్ణయించుకున్నప్పటికీ..అది కుదరకపోవడం వల్ల.. బీజేపీకి బ్రేకప్ చెప్పాలంటూ పార్టీ నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి ఒత్తిళ్లు తీవ్రతరం అయ్యాయని, దాని ప్రభావంతోనే పవన్ కల్యాణ్..తన అసహనాన్ని తెలంగాణ బీజేపీ నేతలపై చూపించారని చెబుతున్నారు.