మీకు ఓటు ఎందుకు వేయాలి: టీఆర్ఎస్ మాజీలను అడ్డుకున్న యువకులు, గ్రామస్తులు
సిద్దిపేట: టీఆర్ఎస్ అభ్యర్థులకు పలుచోట్ల చుక్కెదురవుతోంది. ప్రచారం కోసం వెళ్తున్న అభ్యర్థులను స్థానికులు పలుచోట్ల అడ్డుకుంటున్నారు. ఈటెల రాజేందర్, రేఖా నాయక్, బొడిగె శోభ, శంకర్ నాయక్, రాజేందర్ రెడ్డిలని వారి వారి నియోజకవర్గాల్లో ప్రజలు అడ్డుకున్నారు.
తాజాగా సిద్దిపేట జిల్లా చెప్యాలలో దుబ్బాక మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని యువకులు ఆయనను నిలదీశారు. మురికి కాల్వలు, సీసీ రోడ్లు, ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు తదితర సమస్యలపై ఇప్పటివరకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో వచ్చి అడిగితే ఓటు వేస్తామా అని ప్రశ్నించారు.
ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్కు కూడా నిరసన సెగ తగిలింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లొత్తునూరులో ప్రచారం నిర్వహిస్తుండగా గ్రామస్తులు ఆయనను అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కరించలేదని, తాగునీరు ఏదని ప్రశ్నించారు. ప్రజలు నిరసన తెలపడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.