చిన్నారిని పీక్కుతిన్న పందులు: పాతబస్తీలో భారీగా మత్తు ఇంజెక్షన్లు స్వాధీనం
హైదరాబాద్: వరంగల్ జిల్లాలో గురువారం దారుణ సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆడపిల్లను పోషించడం తమకు భారమనుకున్నారో లేక పెద్దమొత్తంలో కట్నకానుకలిచ్చి పెళ్లి చేయలేమని భావించారో తెలియదు కానీ ముక్కుపచ్చలారని ఓ చిన్నారిని పందులు పీక్కుతినేలా చేశారు.
జిల్లాలోని హన్మకొండలోని పద్మాక్షి కాలనీలో వెలుగుచూసిన సంఘటన అత్యంత దారుణంగా ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో పసిపాపను నడివీధిలోని చెత్తకుండీలో విసిరేశారు. రోడ్డుపక్కన నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసిన చిన్నారి మృతదేహాన్ని పందులు అమాంతం పీక్కుతింటున్నాయి.
ఈ ఘటటను చూసిన స్థానికులు పందులను తరిమేసి చిన్నారిని చూడగానే అప్పటికే చనిపోయి ఉంది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పాతబస్తీలో భారీగా మత్తు ఇంజెక్షన్లు స్వాధీనం
హైదరాబాద్లోని పాతబస్తీలో పోలీసులు భారీగా మత్తు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు చేపట్టిన పోలీసులు నలుగురు యువకుల వద్ద నుంచి ఈ మత్తు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. మెడికల్ షాపుల్లో ఇంజెక్షన్లను కొని యువకులు వాడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
162 మత్తు ఇంజెక్షన్లను ఆ నలుగురు యువకుల నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఒక్కో ఇంజెక్షన్ ఖరీదు రూ. 200 నుంచి రూ. 1000 వరకు ఉంటుందని చెప్పారు. ఈ మత్తు ఇంజెక్షన్కు ఒకసారి వాడటం మొదలుపెడితే, జీవితాంతం వాడుతూనే ఉంటారని అన్నారు.
మెడికల్ షాపులతో టైఅప్ అయి ఈ యువకులు ఈ మత్తు ఇంజెక్షన్ వ్యాపారాన్ని చేస్తున్నారని తెలిపారు. ఈ మత్తు ఇంజెక్షన్ను తీసుకుంటే సుమారు రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు మత్తులో ఉంటారని పోలీసులు పేర్కొన్నారు. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మత్తు ఇంజెక్షన్లు కొన్న మెడికల్ దుకాణాల వివరాలను సేకరిస్తున్నారు.