ప్రభుత్వ ఆస్పత్రుల ప్రక్షాళనకు శ్రీకారం .. నిర్లక్షం జబ్బుకు నిఘా వైద్యం
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్ల మరియు సిబ్బంది అలసత్వానికి చెక్ పెట్టే పనిలో పడింది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ . ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది ఎవరికి వారు ఇష్టారాజ్యంగా ఆస్పత్రికి వచ్చి వెళ్లడాన్ని, ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యటాన్ని సీరియస్ గా తీసుకున్న వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సమయపాలన పాటించని వారిపై ఉక్కు పాదం మోపడానికి సిద్ధమైంది . అందులో భాగంగా నూతన మంత్రివర్యులు ఈటెల రాజేందర్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో చర్చనీయాంశం అవుతుంది. మంత్రి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు బయోమెట్రిక్ విధానాన్ని కూడా అమలులోకి తెచ్చి ఏరోజుకారోజు హాజరు నివేదికలను పరిశీలించనున్నారు. ప్రభుత్వ దవాఖానాల్లోని నిర్లక్ష్యం జబ్బుకు నిరంతర నిఘా తో వైద్యం చేయనున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం పడకేయటమే... ప్రైవేట్ దోపిడీకి కారణం
ప్రభుత్వ ఆసుపత్రి లో పనిచేసే వైద్యులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. సమయపాలన పాటించరు అనేది ప్రజల్లోనూ, ఇటు ప్రభుత్వం దృష్టిలోనూ ఉన్న నిశ్చితాభిప్రాయం. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేక, సరైన వైద్యం అందుతుందన్న నమ్మకం లేక చాలామంది ప్రైవేట్ ఆస్పత్రుల బాట పడుతున్నారు. ఇక గ్రామాల్లో అయితే ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం సరిగా అందకపోవటంతో, ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో విధిలేని స్థితిలో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడీకి తెగ పడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు సైతం అందినకాడికి దండుకుంటున్నారు.

వైద్య ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి కీలక నిర్ణయం
వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఈటెల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వాసుపత్రుల ప్రక్షాళనకు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులతోపాటు సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలకు ఉపక్రమించాలని సూచించారు. అందులో భాగంగా ప్రతి ఆస్పత్రిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న మంత్రి త్వరితగతిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే బయోమెట్రిక్ విధానాన్ని కూడా అమలులోకి తీసుకు రావాలని నిర్ణయించారు. అంతే కాదు ప్రతిరోజు హాజరు నివేదికలు పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనితీరు మెరుగు పడాలంటే నిరంతరం నిఘా ఉండాలని మంత్రి అధికారులకు సూచించారు.

మంత్రి ఆదేశాల మేరకు .. మూడు రకాలుగా సమాచార సేకరణ
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించి మూడు రకాల సమాచార సేకరణకు నిర్ణయం తీసుకుంది వైద్య ఆరోగ్య శాఖ. ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరు కావడం, విధులకు హాజరై మధ్యలో నుండి వెళ్లిపోవడం, విధులకు ఆలస్యంగా హాజరు కావడం వంటివాటిపై దృష్టి సారించి ప్రతి ఆసుపత్రి నుండి వివరాలు సేకరించాలని నిర్ణయించింది. ఇక కొందరు వైద్యులు ఆసుపత్రికి రాకున్నా వారి సంతకాలు వేరే వ్యక్తులు చేస్తున్నారని గుర్తించిన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వీటిపై పూర్తిస్థాయి నిఘా పెట్టనున్నారు. బయోమెట్రిక్ తో పాటు, సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపైన కఠినంగా శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు గా తెలుస్తోంది.

మంత్రి నిర్ణయంపై ప్రజల్లో హర్షం
మొత్తానికి వైద్య ఆరోగ్యశాఖను ప్రక్షాళన చేయడానికి మంత్రివర్యులు తీసుకున్న నిర్ణయం పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఈ ప్రయత్నం కొంతమేర అయినా సత్ఫలితాలనిస్తుందని అందరి భావన. అన్ని స్థాయిల ప్రభుత్వాసుపత్రులలో నిరంతర పర్యవేక్షణ ఉంటే కచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం సామాన్యులకు అందుతుంది. ప్రైవేట్ ఆసుపత్రుల, ఆర్ఎంపీల దోపిడీకి చెక్ పడుతుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం మెరుగుపడుతుంది.












Click it and Unblock the Notifications