సీఎం గారూ.. ఇది వింటున్నారా? తెలంగాణకు ఇవన్నీ ఇచ్చాం!
తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రాష్ట్ర ప్రగతి దేశ పురోగతికి ఇంధనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘనస్వాగతం పలికారు. అనంతరం హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ప్రధాని రూ.9,377 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
"సీఎం గారూ.. ఇది వింటున్నారా?"
తెలంగాణకు కేంద్రం కేటాయిస్తున్న నిధులపై ప్రధాని మోదీ గణాంకాలతో సహా వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. "రేవంత్రెడ్డి గారూ, ఇది వింటున్నారా?. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రైల్వే బడ్జెట్లో కనీసం రూ.1,000 కోట్లు కూడా దక్కేవి కావు. కానీ నేడు ఒక్క తెలంగాణకే రూ.5,500 కోట్లు కేటాయించాం. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.15 వేల కోట్ల రైల్వే పనులు శరవేగంగా జరుగుతున్నాయి" అని పేర్కొన్నారు. తెలంగాణకు ఇప్పటికే 5 వందే భారత్, 6 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఇచ్చామని గుర్తు చేశారు.

సైబరాబాద్ సామర్థ్యం అంతర్జాతీయ స్థాయి
దేశాభివృద్ధిలో సైబరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని కొనియాడారు. "సైబరాబాద్ సామర్థ్యం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరింది. సైబర్ టెక్నాలజీ, విద్యుత్, ఈవీ (EV) రంగాలలో ఈ నగరం అగ్రగామిగా నిలుస్తోంది. ఇక్కడ ప్రాణం పోసుకుంటున్న పెద్ద ప్రాజెక్టులు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. హైదరాబాద్ ఇప్పుడు దేశానికే ఉపాధి కేంద్రంగా మారింది" అని ప్రధాని వెల్లడించారు.
#WATCH | Hyderabad, Telangana: Prime Minister Narendra Modi says, "For an undivided Andhra Pradesh before 2014, the railway budget was even less than Rs 1 thousand crore. Today, it's not just about united Andhra, but the railway budget for Telangana alone is approximately Rs… pic.twitter.com/DadNITDQU8
— ANI (@ANI) May 10, 2026
వరంగల్కు టెక్స్టైల్ కళ.. ప్రాజెక్టుల వెల్లువ
వరంగల్లో ప్రారంభించిన పీఎం మిత్ర టెక్స్టైల్ పార్కుపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని టెక్స్టైల్ రంగానికి ఈ పార్క్ కొత్త ఊపిరి పోస్తుందని, దీని ద్వారా స్థానిక యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అలాగే గత పదేళ్లలో తెలంగాణలో జాతీయ రహదారులు రెట్టింపు అయ్యాయని, లక్షల కోట్ల నిధులతో రహదారుల నెట్వర్క్ను బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
రాజకీయాలు వద్దు.. అభివృద్ధే ముద్దు
సీఎం రేవంత్ రెడ్డి 'తాను ఇక్కడ రాజకీయాలు మాట్లాడను' అని చేసిన వ్యాఖ్యలకు ప్రధాని స్పందిస్తూ.. "ముఖ్యమంత్రి గారు రాజకీయాలు మాట్లాడనని చెప్పారు, నేను కూడా మాట్లాడను. తెలంగాణ అభివృద్ధికి మా ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుంది. పదేళ్లలో గుజరాత్కు ఎంత ఇచ్చామో.. తెలంగాణకూ అంతే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. వాస్తవానికి అలా సమానంగా పంచితే మీకే ఎక్కువ లాభం జరుగుతుంది" అని చమత్కరించారు.
తెలంగాణ వికసిస్తేనే దేశం వికసిస్తుందని, రాష్ట్రానికి రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు, ప్రాజెక్టులు అందిస్తామని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.














Click it and Unblock the Notifications