ఐటీ సిటీ - టెంపుల్ సిటీ వందేభారత్ రెడీ : ప్రధాని మోదీ షెడ్యూల్ ఇలా..!!
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. అధికారికంగా షెడ్యూల్ ప్రకటించారు. అధికారిక కార్యక్రమాలతో పాటుగా బహిరంగసభలోనూ ప్రధాని పాల్గొంటారు. తెలుగు రాష్ట్రాల్లో మూడు నెలల కాలంలోనే రెండో వందేభారత్ ను ప్రధాని ప్రారంభించనున్నారు.
కొత్తగా 13 ఎంఎంటీఎస్ సేవలను ప్రధాని ఆవిష్కరిస్తారు. దీంతో పాటుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను ప్రారంభిస్తారు. పెరేడ్ గ్రౌండ్ నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలను వర్చువల్గా ప్రారంభిస్తారు. అనంతరం గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు.

రెండో వందేభారత్ సిద్దం: సంక్రాంతి నాడు తెలుగు రాష్ట్రాల్లో తొలి వందేభారత్ సికింద్రాబాద్ - విశాఖ మధ్య ప్రధాని ప్రారంభించారు. ఏప్రిల్ 8 వ తేదీ ఉదయం 11:30 గంటలకు మోడీ హైదరాబాద్ లోని బేగంపేటకు చేరుకుంటారు. ఉదయం 11:45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకొని వందేభారత్ రైలును ప్రారంభిస్తారు.
మూడు నెలల సమయంలోనే తెలుగు రాష్ట్రాల్లో మరో వందేభారత్ ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ఐటీ సిటీ - టెంపుల్ సిటీని కలపనుంది. రూ 720 కోట్లతో ప్రపంచ స్థాయి సౌకర్యాలు, సుందరీకరణతో రూపొందిస్తున్న సికింద్రబాద్ ఐకానిక్ రైల్వే స్టేషన్ భవనానికి ప్రధాని మోదీ ఈ పర్యటనలో శంకుస్థాపన చేయనున్నారు.
రూ 11,300 కోట్ల పనులకు శంకుస్థాపన: మధ్యాహ్నం 12:15 గంటలకు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్కు చేరుకుంటారు. పరేడ్ గ్రౌండ్ నుండి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలను వర్చువల్గా ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో మొత్తంగా రూ 11,300 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ - సికింద్రాబాద్ విభాగంలో 13 కొత్త మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసు సేవలను ప్రధాని ప్రారంభిచనున్నారు.
సికింద్రాబాద్ - మహబూబ్ నగర్ ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుదీకరణ పనులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. బీబీనగర్ ఏయిమ్స్ కు ఉన్న 201.65 ఎకరాల స్థలంలో రూ 1,365.95 కోట్ల వ్యయంతో 750 పడకల ఆస్పత్రి, 20 భవన సముదాయయంతో పాటుగా ఇతర వసతులు కల్పించనున్నారు.
బహిరంగ సభలో ప్రధాని మోదీ: పరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనుననారు. ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని రాజకీయంగా ఏం మాట్లాడబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కు దారి తీసిన పరిణామాలపైనా ప్రధాని ఆరా తీసారు.
బెయిల్ పైన సంజయ్ ను బయటకు తీసుకొచ్చేందుకు పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ వర్సస్ బీజేపీ పోరు తీవ్ర స్థాయికి చేరింది. ఈ క్రమంలో ప్రధాని ఈ పర్యటనలో పార్టీ నేతలకు ఎన్నికల దిశగా కీలక దిశా నిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications