ప్రధాని మోడీ పర్యటన: షెడ్యూల్ లో సీఎం కేసీఆర్ ప్రసంగానికి 5 నిముషాలు!!
భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీ పర్యటనకు హాజరవుతారా? లేదా? అన్నది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం అందింది .అంతే కాదు ప్రధాని మోడీ వరంగల్ పర్యటన లో చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ ప్రకారం తెలంగాణ సీఎం కేసీఆర్ కు 11:11 నుండి 11: 15 నిమిషాలకు 5నిమిషాలపాటు మాట్లాడడానికి సమయాన్ని కూడా కేటాయించారు.

సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు హాజరవుతారా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదని, తెలంగాణపై చిన్నచూపు చూస్తుందని మొదటి నుంచి బీజేపీ సర్కార్ ను విమర్శిస్తూ వస్తున్న కేసీఆర్, కేంద్రంలో బీజేపీ సర్కారును గద్దె దించడం కోసం టిఆర్ఎస్ పార్టీని, బి ఆర్ ఎస్ పార్టీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కేంద్రంలోని బిజెపి సర్కార్ పై ప్రచ్ఛన్న యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు కేసీఆర్. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు ఎన్ని సార్లు వచ్చినా కేసీఆర్ కనీసం స్వాగతం పలకలేదు. ప్రధాని మోడీ తెలంగాణలో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కాలేదు. దీంతో ప్రస్తుతం కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ కచ్చితంగా ప్రధాని మోడీ కి ఆహ్వానం పలకరు మళ్లీ పాత సీన్ రిపీట్ అవుతుంది అన్న చర్చ జరుగుతుంది.

ఈసారి కూడా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధాని నరేంద్ర మోడీ కి ఆహ్వానం పలుకుతారని ప్రధానంగా భావిస్తున్నారు.తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం హోదాలో అధికారికంగా హాజరు కావాల్సి ఉన్నా తెలంగాణ సీఎం ఈ కార్యక్రమానికి హాజరైతే ప్రజలలోకి అది వేరేగా వెళుతుందని, తెలంగాణ రాష్ట్రానికి అడుగడుగున అన్యాయం చేస్తున్న మోడీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకాబోరని బీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రధాని మోడీ వరంగల్ కు రాక కేవలం రాజకీయం మాత్రమేనని విమర్శిస్తున్న వారు కూడా లేకపోలేదు. ఏదిఏమైనా ఈ దఫా కూడా సీఎం కేసీఆర్ పి ఎం ఆఫీస్ నుంచి అధికారికంగా ఆహ్వానాన్ని అందుకున్నా మోడీ పర్యటన లో పాల్గొనడం మాత్రం జరగబోదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కేసీఆర్ ఏం చేయబోతున్నారో వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications