మంచు ఫ్యామిలీ గొడవల్లో బిగ్ టర్న్: మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు ఫైల్..!!
Mohan Babu: కుటుంబంలో ఆస్తి తగాదాలను ఎదుర్కొంటోన్నారు ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు. ఆస్తి పంపకాల వ్యవహారంలో చిన్న కొడుకు మంచు మనోజ్, కోడలు భూమా మౌనిక రెడ్డితో ఘర్షణ పడుతున్నారు. ఈ గొడవలు కాస్తా రచ్చకెక్కాయి. విభేదాలు వీధిన పడ్డాయి. అభిప్రాయభేదాలు భగ్గుమన్నాయి.
ఈ గొడవల జల్పల్లిలో గల మంచు టౌన్ షిప్ వద్ద రెండు రోజులుగా హైడ్రామా చోటు చేసుకుంటూ వస్తోంది. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయక్కడ. పరస్పరం భౌతికంగా దాడులు చేసుకునేంత వరకూ వెళ్లాయి. మంచు విష్ణు-మనోజ్కు చెందిన బౌన్సర్లు పరస్పరం తోసుకున్నారు. ఒకదశలో కొట్టుకున్నారు కూడా.

అదే సమయంలో మోహన్ బాబు సైతం రంగంలోకి దిగారు. తన ఆగ్రహావేశాలను మీడియా ప్రతినిధులపై చూపించారు. ఓ న్యూస్ ఛానల్కు చెందిన విలేకరిపై దాడి చేశారు. మైక్తో బలంగా కొట్టారు. ఈ ఘటనలో ఆయన తలకు గాయమైంది. స్వల్పంగా ఫ్రాక్చర్ అయినట్లు స్కానింగ్లో తేలింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తనపై జరిగిన దాడికి నిరసనగా రంజిత్.. మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో లిఖితపూరకంగా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నంబర్ 645/2024 నమోదు చేశారు. భారత్ న్యాయ సంహితలోని సెక్షన్ 118 (1) కింద కేసు ఫైల్ చేశారు.
దీన్ని హత్యాయత్నం కేసుగా బదలాయించారు పోలీసులు. భారత్ న్యాయ సంహిత సెక్షన్ 109 అటెంప్ట్ టు మర్డర్ కింద ఈ దాడి కేసును బదలాయించినట్లు సమాచారం. బీఎన్ఎస్ సెక్షన్ 118 (1) కింద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను హత్యయత్నం కింద మార్చవచ్చా? లేదా? అనే విషయంపై తొలుత లీగల్ ఒపీనియన్ తీసుకున్నారని, ఆ తరువాత దీన్ని సెక్షన్ 109 కిందికి మార్చినట్లు తెలుస్తోంది.
కాగా- ఈ గొడవల నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మోహన్ బాబు ఇద్దరు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ను పిలిపించి మాట్లాడిన విషయం తెలిసిందే. బుధవారం మధ్యహ్నం మనోజ్ను విచారించారాయన. వాంగ్మూలం తీసుకున్నారు. రాత్రి విష్ణు కూడా వ్యక్తిగత విచారణకు హాజరయ్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రవర్తించవద్దంటూ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications