తిరుమలగిరిలో రేడియో జాకీ ఆత్మహత్య: వరకట్న వేధింపులే కారణమా?
సంధ్యాసింగ్ ఆత్మహత్యలో వరకట్నం కోణం ఉండటంతో.. పోలీసులు విశాల్ వైభవ్ పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: గత వారం తిరుమలగిరి పరిధిలోని బొల్లారంలో చోటు చేసుకున్న సంధ్యాసింగ్ అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు తాజాగా వెలుగుచూశాయి.
చనిపోయే నాటికి సంధ్యాసింగ్ చార్మినార్ ఎఫ్ఎంలో రేడియో జాకీగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో రిపోర్టర్గా కూడా పనిచేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే, సంధ్యాసింగ్ ఆత్మహత్య కేసులో ఆమె భర్త విశాల్ వైభవ్ పై ఆరోపణలున్నాయి.
అయితే విశాల్ వైభవ్ మేజర్ కావడంతో.. ఆయన్ను విచారించడానికి.. పోలీసులు రక్షణ శాఖ అనుమతి కోరాల్సి వచ్చింది. ఈ మేరకు పోలీస్ శాఖ రక్షణశాఖకు ఓ లేఖ రాసింది. దీనిపై స్పందించిన రక్షణశాఖ.. ప్రస్తుతం విశాల్ వైభవ్ ఆరోగ్యం బాగా లేదని, గుండెపోటుతో రక్షణశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పేర్కొంది. దీంతో విచారణలో మరింత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది.
సంధ్యాసింగ్ ఆత్మహత్యలో వరకట్నం కోణం ఉండటంతో.. పోలీసులు విశాల్ వైభవ్ పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు.ఏ తప్పు చేయకుంటే.. ధైర్యంగా విచారణను ఎదుర్కోవాల్సింది పోయి విశాల్ వైభవ్ ఇలా అనారోగ్య కారణాలు చెప్పి తప్పించుకోవడంపై పోలీసులకు అనుమానాలు తలెత్తుతున్నాయి. సోమవారం కూడా ఇన్స్పెక్టర్ మహేశ్వర్ రక్షణశాఖ అధికారులను సంప్రదించినా వారి నుంచి సానుకూల స్పందన రాలేదు.