అప్పుడే అయిపోలేదు: 'ఉప్పల్ నరబలి'లో నిగ్గు తేలనివెన్నో!, ఆ సాక్ష్యాలు దొరికి ఉంటే..
హైదరాబాద్: ఉప్పల్ నరబలి కేసులో ముందు నుంచి పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ వచ్చిన నిందితుడు రాజశేఖర్.. ఇంకా నిజాలేమైనా దాస్తున్నాడా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నరబలి ఇచ్చిన చిన్నారి మొండేన్ని మూసీ నదిలో పడేశానంటూ అతను చెప్పడంలో నిజమెంత? అన్న దానిపై ఇప్పుడు పోలీసులకు అనుమానాలు కలుగుతున్నాయి.
Recommended Video
ఉప్పల్ నరబలి: తల మాత్రమే డాబాపై ఉంచడం వెనుక?, ఆ సలహాతోనే ఇదంతా..
ఎక్కడో తేడా కొడుతోంది..:
చిన్నారి బోయిగూడ గుడిసెల ప్రాంతం నుంచి అపహరించిన తర్వాత నగర శివారులోని ప్రతాప సింగారం మూసీ నది సమీపానికి వెళ్లినట్టు రాజశేఖర్ విచారణలో వెల్లడించాడు. అక్కడే కత్తితో చిన్నారి తల కోసి.. మొండేన్ని మూసీలో పడేసినట్టు తెలిపాడు. కానీ రాజశేఖర్ చెబుతున్న దాంట్లో ఎక్కడో తేడా కొడుతున్నట్టే అనిపిస్తోంది పోలీసులకు.
పోలీసులకు పెద్ద తలనొప్పే:
నరబలి కేసులో ఏ క్లూ దొరక్కుండా రాజశేఖర్ పకడ్బందీగానే ప్లాన్ చేసుకున్నాడు. నిజానికి జనవరి 1వ తేదీ రాత్రి డాబాపై చిన్నారి తల గానీ దొరక్కపోయి ఉంటే.. అసలు ఈ కేసు బయటకొచ్చేదే కాదేమో!. ఎంత విచారించినా.. అతని నుంచి నిజాలు రాబట్టలేక పోలీసులే తలపట్టుకున్నారు. ఆఖరికి డీఎన్ఏ టెస్టులు చేయిస్తే తప్ప రాజశేఖరే నిందితుడు అని తేల్చలేకపోయారు.
వాటిపై నో క్లారిటీ..:
రాజశేఖర్ చిన్నారి మొండేన్ని ఏం చేసి ఉంటాడన్న దానికి సంబంధించి ఇప్పటికీ పోలీసులకు కూడా క్లారిటీ లేదు. ఈ విషయంపై రాజశేఖర్ అంతగా నోరు మెదపకోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
అదే సమయంలో రాజశేఖర్ చిన్నారిని కిడ్నాప్ చేశానని చెబుతున్న ప్రాంతం గురించి గానీ, మొండెం పడేసినట్లుగా చెబుతున్న మూసీ నది పరిసరాల్లో అతను సంచరించినట్టుగా గానీ పోలీసులు ఎటువంటి ఆధారాలు సంపాదించలేకపోయారు.
ఆ సాక్ష్యాలు దొరికి ఉంటే..:
రాజశేఖర్ చెబుతున్న బోయిగూడ, మూసీ నది పరిసర ప్రాంతాల్లో కేసుకు సంబంధించి పోలీసులు బలమైన సాక్ష్యాధారాలు గనుక సేకరించి ఉంటే.. మరిన్ని నిజాలు బయటపడే అవకాశం ఉండేది. అలాగే చిన్నారి తల్లిదండ్రులెవరో గుర్తించడానికి కూడా అవకాశం ఏర్పడి ఉండేది.
చిన్నారిని బోయిగూడ నుంచే కిడ్నాప్ చేసినట్టు రాజశేఖర్ చెప్పినప్పటికీ.. ఇప్పటికీ ఏ తల్లిదండ్రులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. దీంతో రాజశేఖర్ నిజంగా అక్కడి నుంచే కిడ్నాప్ చేశాడా?.. లేక ఇది కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
కాల్ రికార్డింగ్స్:
ఇక ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత రాజశేఖర్ మాట్లాడిన పలు ఫోన్ కాల్ రికార్డింగ్స్ కూడా పోలీసులు సంపాదించారు. విచారణ కోసం తీసుకొచ్చి వదిలేసిన తర్వాత.. 'తప్పించుకునేలా సమాధానాలు చెప్పాను..' అంటూ సన్నిహితులతో రాజశేఖర్ ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు గుర్తించారు.
కస్టడీలోకి..:
కేసులో పలు విషయాలు ఇంకా మిస్టరీగానే ఉండటంతో.. అతన్ని కస్టడీలోకి తీసుకుని తమదైన శైలిలో విచారించాలనుకుంటున్నారు పోలీసులు. ఎంతకీ నోరు మెదపని రాజశేఖర్ నుంచి కస్టడీలో అయితేనే నిజాలు రాబట్టవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నం కూడా ఎంతమేర సఫలమవుతుందన్నది అనుమానమే!.