కేసీఆర్కు భయపడి కేసు పెట్టకుంటే..: పొన్నం ఫిర్యాదు, కేసీఆర్ దత్తత ఊళ్లో షాక్!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కరీంనగర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ మరిచారని, ఏఒక్క హామీని అమలు చేయలేదన్నారు.
ఈ మేరకు కరీంనగర్లోని వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్ పై చీటింగ్ కేసు నమోదు చేయాలని కోరారు. కేసీఆర్కు భయపడి కనుక కేసు నమోదు చేయకపోతే తాను కోర్టుకు వెళ్తానని పొన్నం ప్రభాకర్ చెప్పారు.
బీజేపీ నేతలను అడ్డుకున్న తెరాస నాయకులు
కరీంనగర్ జిల్లాలోని చిన్న ముల్కనూరులో బీజేపీ నేతలకు చుక్కెదురైంది. ఈ గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇల్ల పరిశీలనకు వచ్చిన బీజేపీ నేతలను స్థానిక తెరాస నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. ఈ గ్రామాన్ని రాష్ట్ర సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.