ys sharmila పార్టీలోకి ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న -కాంగ్రెస్కు మరో షాక్ -రేవంత్ రెడ్డికి పీసీసీపై కామెంట్స్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సాంస్కృతిక విభాగానికి సారధ్యం వహిస్తోన్న ప్రముఖ ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న రాజీనామా ప్రకటించారు. ఈనెల 15న వైఎస్ షర్మిల పార్టీలో చేరబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటికే ఇందిరా శోభన్ లాంటి కీలక నేతలు కాంగ్రెస్ ను వీడి షర్మిల పెట్టబోయే కొత్త పార్టీలో చేరగా, సోమన్న తర్వాత ఇంకొందరూ లోటస్ పాండ్ బాట పట్టబోతున్నట్లు తెలుస్తోంది.

పాపులర్ ప్రజాగాయకుడు..
ప్రజాయుద్ధనౌక గద్దర్ స్థాయి పాపులారిటీ కలిగిన ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న. తన పాటలతో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆయన, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, కేసీఆర్ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలపై చాలా పాటలు రాశారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడటానికి గల కారణాలు, రేవంత్ రెడ్డికి పీసీసీ బాధ్యతలు, కేసీఆర్ సర్కారు తీరు, తెలంగాణలో షర్మిల పార్టీ ఆవశ్యకత తదితర అంశాలను వివరిస్తూ సోమన్న గురువారం ఓ సుదీర్ఘ ప్రకటన చేశారు.

బహుజన గొంతుకలా..
కేవలం పోరాట మార్గం ద్వారానే బహుజన జాతులకు న్యాయం చేకూరదని, చట్ట సభల్లో గొంతు వినిపించడం కూడా అత్యవసరమేనన్న ఏపూరి సోమన్న.. ఆ మేరకు తాను కాంగ్రెస్ లో చేరానని, తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలన్న అభిప్రాయంతో నాడు కాంగ్రెస్ సరైన వేదికలా భవించానని, సొంత నియోజవర్గమైన తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వకున్నా కాంగ్రెస్ కోసం శ్రమించానని, అయితే ఇప్పుడు మాత్రం పార్టీలో పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. కాంగ్రెస్ని విమర్శించాలన్న ఆలోచన తనకు లేదంటూనే ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ మీద నమ్మకం పోయిందని సోమన్న అన్నారు.

రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వకుండా..
ప్రజల్లో ఆదరణ కలిగిన రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమించాలని పార్టీలోని మెజార్టీ కార్యక్తలు డిమాండ్ చేస్తున్నప్పటికీ, దాన్ని పక్కనపెట్టి, వేరే వాళ్ళకు పీసీసీ పగ్గాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని, పార్టీ డౌన్ ఫాల్ లోనూ గ్రూపు రాజకీయాలు అలాగే కొనసాగుతున్నాయని ఏపూరి సోమన్న చెప్పారు. 16 ఏళ్లుగా ప్రజా ఉద్యమాలలో కొనసాగుతోన్న తనను ఏ రాజకీయ పార్టీ కూడా ఆదరించలేదని, సొంత ఊళ్లో ఇల్లు మొదలు పెట్టి పదేళ్లయినా పూర్తి చేయలేనట్లి ఆర్థిక పరిస్థితి తనది సోమన్న అన్నారు.

నియంత కేసీఆర్ను ఎదుర్కోవాలి..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కళాకారులు చాలా మంది కేసీఆర్ కు భజనకారులు అయ్యారని, బహుజనుల న్యాయమైన ఆకాంక్షలు నెరవేరడంలేదని, అందుకోసం గళమెత్తి, 'ఎవని పాలయ్యిందిరో తెలంగాణ..' లాంటి పాటలు రాసి, పాడినందుకు టీఆర్ఎస్ సర్కారు సంకెళ్లు వేయించిందని ఏపూరి సోమన్న గుర్తుచేశారు. పార్టీలు పట్టించుకోక పోయినా, ప్రజలు మాత్రం తనకు అండగా ఉన్నారని, షర్మిల పార్టీలోకి చేరాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తారన్న నమ్మకం ఉందని, తెలంగాణలో నియంత కేసీఆర్ ను ఎదుర్కోవాలని ఏపూరి సోమన్న అన్నారు. ఇంకా..

షర్మిల మాటిచ్చారు, అందుకే..
''బహుజన గొంతుకగా, చట్టసభల్లో నా వాణిని వినిపించాలనే కల.. కలగానే మిగిలిపోక ముందే.. నాకు అవకాశం కల్పిస్తనని వైఎస్ షర్మిల మాటిచ్చారు. ఆమెతో కలిసి నా ప్రజల తరుపున ఈ నియంతృత్వ ప్రభుత్వపై కొట్లడాలనే నేనీ నిర్ణయం తీసుకున్నాను. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడటానికి సరైన వేదిక షర్మిల కొత్త పార్టీనే అని నమ్ముతూ, ఈనెల 15న ఆ పార్టీలో చేరబోతున్నాను. ఈ ప్రయత్నంలో నేను సఫలమైనా, విఫలమైనా, చివరి శ్వాస వరకు నా గొంతును పేదలు, బహుజనుల కోసమే వినిపిస్తుంటాను..'' అని ఏపూరీ సోమన్న పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications