డ్రాగన్ ఘాతుకం: కల్నల్ సంతోష్, ఇతర సైనికుల పోస్టుమార్టం రిపోర్టుల్లో సంచలన విషయాలు
హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం భారత్-చైనా సరిహద్దు గాల్వన్ లోయ ప్రాంతంలో చైనా దొంగదెబ్బ తీసి మన సైనికులపై క్రూరంగా దాడి చేసింది. ఈ దాడిలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతోపాటు 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. కాగా, కల్నల్ సంతోష్ బాబు పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి.
Recommended Video
తలపై తీవ్రగాయం.. నీట ముంచి..
కల్నల్ సంతోష్ బాబు శరీరంపై గాయాలు లేనప్పటికీ తల భాగంలో మాత్రం తీవ్రంగా కమిలిన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. నీట మునగడం వల్ల సంతోష్ బాబుతోపాటు మరో ఇద్దరు సైనికులు చనిపోయారని భావిస్తున్నారు. అమరులైన సైనికుల మృతదేహాలకు లేహ్లోని ఎస్ఎన్ఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
మేకులతో కూడిన ఇనుప రాడ్లతో..
మరికొంతమంది సైనికుల శరీరం, ముఖంపై తీవ్రగాయాలు ఉన్నాయని పోస్టుమార్టం నివేదికల్లో వెల్లడైంది. 17 మంది సైనికుల మృతదేహాలపైనా తీవ్ర గాయాలున్నాయని గుర్తించారు. మేకులతో కూడిన ఇనుప రాడ్లతో చైనా బలగాలు భారత సైనికులపై దాడి చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది.
ప్లాన్ ప్రకారమే డ్రాగన్ ఘాతుకం..
ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే చైనా బలగాలు గాల్వన్ లోయలో భారత సైనికులపై దాడి చేశాయనే విషయం పోస్టుమార్టం నివేదికను బట్టి అర్థమవుతోంది. మన సైనికులను రెచ్చగొట్టి ముందుగా తెచ్చుకున్న కత్తులు, ఇనుప రాడ్లు, ఫెన్సింగ్ చుట్టిన ఆయుధాలతో భారత సైనికులపై డ్రాగన్ దళాలు దాడులు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ముగ్గురు సైనికుల ముఖాలు గుర్తు పట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. మరో ముగ్గురి మెడ భాగంలో కోసిన గుర్తులున్నాయి. దాడిలో చైనా దళాలు కత్తులు కూడా ఉపయోగించినట్లు అర్థమవుతోంది. 14వేల అడుగుల ఎత్తన ఉన్న లడఖ్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతుంటాయి. మైనస్ డ్రిగీల ఉష్ణోగ్రతలు, ఆక్సిజన్ సరిగా అందకపోవడం వల్ల 12 మంది సైనికులు చనిపోయారని ఓ సీనియర్ సైనికాధికారి వెల్లడించారు.
అంతా సిద్ధం చేసుకుని ఒక్కసారిగా మన సైనికులపై..
భారత ప్రతిఘటన నేపథ్యంలో మన భూభాగానికి దగ్గరగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టును తొలగించిన చైనా.. ఉద్దేశపూర్వకంగానే మరోసారి ఆ చెక్ పోస్టును పెట్టడంతో వివాదం మొదలైంది. చైనా దళాలను అడ్డుకునే ప్రయత్నం చేశాయి కల్నల్ సంతోష్ బాబు నాయకత్వంలోని భారత సైనికులు. అయితే, అప్పటికే దాడికి కుట్ర పన్నిన చైనా బలగాలు వెంటనే భారత సైన్యంపై రాళ్లు, ఇనుపరాడ్లు, కత్తులు లాంటి ఆయుధాలతో దాడులు చేశాయి.
అయినా వెనక్కి తగ్గకుండా భారత సైనికులు వారిని సమర్థంగా ఎదుర్కొన్నాయి. ఈ దాడిలో భారత్ వైపున 20 మంది సైనికులు అమరులవగా.. చైనాకు చెందిన సుమారు 43 మంది సైనికుల హతమయ్యారు. తమ వైపు మరణాలపై చైనా ఇప్పటికీ అధికారిక ప్రకటన చేయలేదు. ఓ వైపు చర్చలంటూనే దాడులు చేయడంపై డ్రాగన్ దేశంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆ దేశంతో కుదుర్చుకున్న పలు భారీ ప్రాజెక్టులను కూడా రద్దు చేసుకుంది. ప్రజలు కూడా చైనా వస్తువులను వాడకూడదని నినదిస్తున్నారు.