తెలంగాణలో కరెంట్ కోతలు: కుట్రలని ఆగ్రహం; సీఎం రేవంత్ వారికి ఇచ్చి పడేశారుగా!!
తెలంగాణ రాష్ట్రంలో ఎండాకాలం సమీపిస్తున్న కొద్ది ప్రజలలో కరెంటు కోతలపై భయం పెరిగిపోతుంది. అందుకు తగ్గట్టు రాష్ట్రంలోనూ కరెంటు కోతలు చోటు చేసుకోవడం ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఈ అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలు సద్వినియోగం చేసుకుంటూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కరెంటు కోతలు కామన్ అంటూ ప్రచారం చేస్తున్నాయి.
కరెంట్ కోతల వ్యవహారంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి కరెంటు కోతల తలనొప్పి మొదలైంది. దీనికి చెక్ పెట్టాలని భావించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కరెంటు కోతల విషయంలో క్లారిటీ ఇచ్చి, విద్యుత్ శాఖ అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై దుష్ప్రచారం చేసే వారి పైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ తనదైన శైలిలో ఇచ్చి పడేశారు.

అసలు తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ అధికారుల పై సీరియస్ అయ్యారు. ఎలాంటి కారణం లేకుండా కరెంటు కట్ చేస్తే సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే కుట్రలను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కరెంటు కోతలకు బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్ కోతలు విధించడం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి సర్కారుకు చెడ్డ పేరును తీసుకురావడం కోసం కొంతమంది కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, దీనిని సహించేది లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది ఉద్దేశపూర్వకంగా కరెంట్ కట్ చేస్తున్నారన్న సమాచారం తమకు ఉందని, ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరికలు జారీ చేశారు.
గతంతో పోలిస్తే ప్రస్తుతం విద్యుత్ సరఫరా పెంచినప్పటికీ, విద్యుత్ కట్ జరుగుతుందని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టాల్సిన అవసరం విద్యుత్ శాఖ అధికారులపై ఉందని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అంతేకాదు కరెంటు కోతల పైన ఎవరైనా దుష్ప్రచారం చేస్తే సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయాలని విద్యుత్ అధికారులకు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.
రాబోయే మూడు నెలలు వేసవిలో వ్యవసాయానికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, విద్యుత్ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి విద్యుత్ సరఫరా చూడాలని ఇటీవల ఆయన విద్యుత్ శాఖ అధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో సూచించారు. విద్యుత్ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్లను పక్కాగా నిర్వహించాలని, ఎప్పటికప్పుడు ప్రజల విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని భట్టి విక్రమార్క సూచించారు.












Click it and Unblock the Notifications