గణేష్ మండపంలో పూజ విషయంలో ఇరు వర్గాల నుంచి ఒత్తిడి.. పూజారి హఠాన్మరణం
దేశవ్యాప్తంగా బ్రిటిష్ కాలం నుంచి వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. అప్పట్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా యావత్ భారత యువతీయువకులను ఒక్కతాటిపైకి తీసుకువచ్చి వారిలో దేశభక్తి, మన సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించేందుకు అందరూ కలిసి ఐకమత్యంతో ఉండేందుకు వినాయ చవితికి ఊరూ వాడా విగ్రహాలు ఏర్పాటు చేసేవాళ్లు. కానీ రాను రాను కాలం మారింది. ఇప్పటి డిజిటల్ యుగంలో గణపతి ఉత్సవాల్లో గ్రామస్థులు, కాలనీవాళ్లు, రాజకీయనేతలు, ఇతర వర్గాల వాళ్లు తమ ప్రెస్టేజీని చూపిస్తున్నారు. భక్తి మరిచి హంగూ ఆర్భాటాలు ఎక్కువై పోయాయి. తమ విగ్రహం ఎత్తు ఎక్కువ అంటే తమ విగ్రహం ఎత్తు ఎక్కువ అంటూ పోటీలు పెరిగాయి. అలాగే తాము వినాయక చవితి ఉత్సవాలను గొప్పగా నిర్వహిస్తే.. తాము మరింత గొప్పగా నిర్వహించామంటూ గొప్పలు చెప్పుకోవడం పరిపాటిగా మారింది. ఇటీవలి కాలంలో గణేష్ ఉత్సవాల వద్ద ఇరు వర్గాల ఘర్షణలు కూడా చోటుచేసుకోవడం మనం చూస్తున్నాం.
అయితే తాజాగా నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం చింతలపాలెం గ్రామంలో ఇలాంటి ఘటనే జరిగింది. గ్రామంలోని ఇరు వర్గాలు తొలుత తమ గణపతి మండపానికే వచ్చి పూజ చేయాలంటూ ఆ ఊరిలోని పూజారిని ఇబ్బంది పెట్టారు. ఈ మేరకు ఇరు వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడికి తట్టుకోలేక ఆయన పూజ నిర్వహిస్తూ గుండెపోటుతో మృతి చెందారు. దాంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూజారి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
ఏం జరిగిందంటే..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జునసాగర్ పైలాన్ కాలనీకి చెందిన ఉప్పల దత్తు ప్రసాద్ చింతలపాలెం గ్రామంలో పూజారిగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే సోమవారం వినాయక చవితి సందర్భంగా ఉదయం సుమారు 9 గంటల 30 నిమిషాల సమయంలో చింతలపాలెం గ్రామంలోని రామాలయం సమీపంలోని గణేష్ మండపంలో పూజలు నిర్వహిస్తుండగా.. అప్పుడు అదే గ్రామానికి చెందిన గుండాల రవి, పున్నయ్యలు అక్కడికి వచ్చి ముందుగా తమ వినాయకుడి మండపం వద్దే పూజలు చేయాలని గొడవకు దిగారు. ఈ క్రమంలో వాళ్లు పూజారి దత్తు ప్రసాద్ పై చేతులు వేస్తూ దురుసుగా ప్రవర్తించారు. అనంతరం గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని నచ్చజెప్పారు.

ఆ తర్వాత గుండాల రవి ఆధ్వర్యంలోని గణేష్ మండపం వద్దకు పూజారి దత్తు ప్రసాద్ ను తీసుకెళ్లారు. అక్కడ పూజ చేస్తుండగా దత్తు ప్రసాద్ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో వెంటనే ఆయన్ను సాగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు. ఈ క్రమంలో దత్తు ప్రసాద్ కుమారుడు ఉప్పల శ్రీ వల్లభ రాఘవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications
