తెలంగాణలో చంద్రబాబు లేని లోటు, మంచి వ్యక్తే కానీ: కారు ఎక్కిన ఎమ్మెల్యే వివేక్
హైదరాబాద్: టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు లేని లోటు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో స్పష్టంగా కనిపిస్తోందని, చంద్రబాబు చాలా మంచి నాయకుడని, తమ పార్టీకి కూడా ప్రజల్లో మంచి పేరు ఉందని, కానీ ఇప్పుడు ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని అందుకే తాను తెరాసలో చేరానని ఎమ్మెల్యే వివేక్ అన్నారు.
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ (వివేక్) మంగళవారం ఉదయం పదకొండు గంటల సమయంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆయనకు గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
తెలంగాణ ప్రజలు ఇప్పుడు అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే తెరాసలో చేరానని చెప్పారు. తెరాసలో చేరడం ద్వారా స్వగృహం వచ్చినట్లుగా ఉందన్నారు. గతంలో తాను తెరాసలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని చెప్పారు.
హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దడం ముఖ్యమంత్రి కెసిఆర్తోనే సాధ్యమని చెప్పారు. కెసిఆర్ సంక్షేమ పథకాలు ప్రజలు మెచ్చేవిగా ఉన్నాయన్నారు. ఆ సంక్షేమ పథకాలు తనకు నచ్చాయని చెప్పారు. ప్రజలు ఇప్పుడు అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పారు.
తెలంగాణ టిడిపిలో తెరాస లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. టిడిపిలో మాకు అన్యాయం ఏమీ జరగలేదని, ఆ పార్టీ నుంచే తాము ఎమ్మెల్యేగా గెలిచామన్నారు. చంద్రబాబు మంచి వ్యక్తి నాయకుడు అన్నారు. టిడిపి ద్వారా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నామని చెప్పారు.