ప్లీజ్ స్టాప్ ర్యాగింగ్: సూసైడ్ నోట్ రాసి విద్యార్థి ఆత్మహత్య
మేడ్చల్: ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు. ‘‘ప్లీజ్ స్టాప్ ద ర్యాగింగ్. ఆ రోజు సీనియర్లు అలా చేయకపోతే నాకు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు'' అని సూసైడ్ నోట్ రాసి పెట్టి సాయినాథ్ అనే 19 ఏళ్ల విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన కనకయ్య కుమారుడు.
ఈ ఏడాదే హైదరాబాద్ మేడ్చల్లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరంలో చేరాడు. ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ కాలేజీకి వెళ్తున్నాడు. అయితే నాలుగు రోజులుగా సాయినాథ్ తరగతులకు హాజరుకాలేదు. శనివారం రాఖీ రోజున బోరబండలోని తన అక్క వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకున్నాడు.
సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో హాస్టల్ నుంచి బయటకు వెళ్లాడు. అదే రోజు రాత్రి 12 గంటల సమయంలో వరంగల్-ఖాజీపేట మధ్యలో రైలు పట్టాలపై శవమై కనిపించాడు. సాయినాథ్ జేబులో లభించిన ఐడీ కార్డు ద్వారా సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ విద్యార్థిగా రైల్వే పోలీసులు తేల్చారు. సాయినాథ్ దుస్తులను పోలీసులు తనిఖీ చేయగా ఒక కాగితం లభించింది.
సీనియర్లు ‘అలా (ర్యాగింగ్?)' చేయకపోతే తనకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అందులో రాసి ఉంది. దీంతో సీనియర్ల ర్యాగింగ్ను భరించలేకనే అతడు కాలేజీ మాని, స్వగ్రామానికి వెళ్తూ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. లేఖలో అంతకు మించి వివరాలు లేకపోవడంతో ఏం జరిగిందనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దర్యాప్తు నిమిత్తం పోలీసులు మంగళవారం సాయంత్రం కాలేజీ వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే కళాశాల సమయం ముగియడంతో యాజమాన్యం, విద్యార్థులు ఎవరూ అందుబాటులో లేరు. బుధవారం సార్వత్రిక సమ్మె కారణంగా కాలేజీకి సెలవు ప్రకటించారు.
కాజీపేట రైల్వే పోలీసులు ఇచ్చిన సమాచారంతో సాయినాథ్ తండ్రి కనకయ్య, సోదరుడు శ్రీనివాస్, సోదరి అనూష మంగళవారం సాయంత్రానికి ఎంజీఎం మార్చురీకి చేరుకున్నారు. అతడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
దురదృష్టకరం: ఐటీ ప్రిన్సిపాల్ జంగారెడ్డి
తమ కళాశాల విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని సీఎంఆర్ ఐటీ ప్రిన్సిపాల్ జంగారెడ్డి అన్నారు. తమ క్యాంపస్లో ర్యాగింగ్కు తావు లేదన్నారు. విద్యార్థి మృతికి కారకులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సీనియర్లు వేధిస్తున్నారనే విషయాన్ని సాయినాథ్ తమ దృష్టికి ఎప్పుడూ తీసుకురాలేదని ఆయన చెప్పారు.