తెలంగాణకు రాహుల్, ప్రియాంక: రామప్పలో ప్రత్యేక పూజలు, పర్యటన సాగనుందిలా
హైదరాబాద్: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మరింత జోరుగా కొనసాగించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మూడు రోజులపాటు కాంగ్రెస్ నేతలు బస్సు యాత్ర చేయనున్నారు. 3 రోజుల్లో 8 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ బస్సు యాత్రలు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొననున్నారు.
రైతులు, మహిళలు, నిరుద్యోగులతో వారు ముచ్చటించనున్నారు. ఈ క్రమంలో బుధవారం అంటే అక్టోబర్ 18న తెలంగాణలో రాహుల్, ప్రియాంక అడుగుపెట్టనున్నారు. ముందుగా, ములుగు జిల్లాలోని ప్రసిద్ధ రామప్ప ఆలయంలో రాహుల్, ప్రియాంక ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. అనంతరం రామానుజపురంలో తలపెట్టిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రాహుల్, ప్రియాంక పర్యటన క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.

రాహుల్, ప్రియాంక పర్యటన కొనసాగనుందిలా..:
అక్టోబర్ 18న ములుగు, భూపాలపల్లిలో పర్యటన
19న రామగుండం, పెద్దపల్లి, కరీంనగర్లో యాత్ర
20న నిజామాబాద్ జిల్లాలో రాహుల్ బస్సు యాత్ర
ఆర్మూరులో పసుపు రైతులతో భేటీ కానున్న రాహుల్
ఇక బస్సుయాత్రలో భాగంగా.. బుధవారం ములుగు, భూపాలపల్లిలో పర్యటించడంతోపాటు ములుగు బహిరంగ సభలో ప్రసంగిస్తారు రాహుల్గాంధీ. 19న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి, కరీంనగర్ పట్టణంలో ప్రచారం నిర్వహించనున్నారు. సింగరేణి, ఎన్టీపీసీ వర్కర్స్ యూనియర్ నేతలతో భేటీ కానున్నారు. అనంతరం పెద్దపల్లి బహిరంగ సభలో పాల్గొననున్నారు రాహుల్గాంధీ.
20న నిజామాబాద్ జిల్లాలో రాహుల్గాంధీ బస్సు యాత్ర కొనసాగించనున్నారు. ఇందులో భాగంగా బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ పట్టణాల్లో పర్యటిస్తారు. బోధన్లో బీడి కార్మికులు, గల్ఫ్ వర్కర్స్ కుటుంబాలతో భేటీ అవుతారు రాహుల్. నిజాం షుగర్ ఫ్యాక్టరీని కూడా సందర్శించనున్నారు. ఆరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆర్మూరులో పసుపు రైతులతో భేటీ కావడంతోపాటు బహిరంగ సభలో పాల్గొననున్నారు.
కాగా, రాహుల్, ప్రియాంక పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశారు. ఇప్పటికే సభాస్థలం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. హెలీప్యాడ్తోపాటు బహిరంగ సభ ప్రాంతాన్ని సందర్శించారు పోలీసు ఉన్నతాధికారులు. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు వస్తుండటంతో భారీ జన సమీకరణకు రాష్ట్ర శ్రేణులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు.












Click it and Unblock the Notifications