ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్!
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ మండుటెండల్లోను చల్లని కబురు చెప్పింది. నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ, నిర్మల్, మెదక్ జిల్లాలతో సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఈ జిల్లాలలో ఆరెంజ్ అలెర్ట్
ఈ జిల్లాలలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ ఈ జిల్లాలలో ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి.

నిన్న ఈ జిల్లాలలో వర్షాలు
నిన్న ఖమ్మం జిల్లా వైరాలో 4సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ లో కూడా 4సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ లో రెండు సెంటీమీటర్ల వర్షపాతం, ఖమ్మం జిల్లా మధిరలో ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదయింది. మరోవైపు హైదరాబాద్ నగరంలో కూడా చిరు జల్లులు కురిశాయి. ఈ సంవత్సరం వాతావరణం ఎండాకాలం మొదటి నుంచి చాలా భిన్నంగా కనిపిస్తుంది.
ఐదు రోజులుగా తెలంగాణలో ద్రోణి ప్రభావంతో వర్షాలు
ఈసారి ఫిబ్రవరి మాసంలోనే ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. అయితే గత ఐదు రోజులుగా మాత్రం ద్రోణి ప్రభావంతో వాతావరణం చల్లబడింది. మార్చి 15, 16 తేదీలలో నుండి రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. పలు జిల్లాలలో కురుస్తున్న వడగళ్ల వానలు రైతులను తీవ్రంగా నష్ట పరుస్తున్నాయి.
ఇంకా రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం
మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న క్రమంలో రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వర్షాల అనంతరం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని మూడు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నవోదయ అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాల విషయంలోనే కాదు, ఎండల సమయంలో కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications