తెలంగాణను వీడని "మోంథా".. స్కూళ్లకు సెలవులు, ఫ్లాష్ఫ్లడ్ హెచ్చరిక ??
మోంథా తుపాన్ తెలుగు రాష్ట్రాలను వణికించింది. భారీ వర్షాలతో పాటు తీవ్రమైన గాలులు తీరని నష్టాన్ని మిగిల్చాయి. అయితే ఈ తుపాను వాయుగుండంగా బలహీనపడినప్పటికీ.. భద్రాచలానికి 120కి.మీ... ఖమ్మంకు 180 కి.మీ... ఒడిశా మల్కన్గిరికి 130 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. ఈ ప్రభావంతో రాగల కొన్ని గంటల్లో తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలే పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా మోంథా ఎఫెక్ట్తో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
రెడ్ అలర్ట్ & ఫ్లాష్ఫ్లడ్..
ఈ క్రమంలోనే మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలానే మరో 9 జిల్లాలకు ఆరెంజ్, ఇంకో 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఆదేశాలు ఇచ్చింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని.. 35-45కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఫ్లాష్ఫ్లడ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఆరు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు..
కాగా భారీ వర్షాల నేపథ్యంతో వరంగల్, సిద్ధిపేట, ములుగు, ఉమ్మడి కరీంనగర్, హన్మకొండ, యాదాద్రి జిల్లాల్లో స్కూళ్లకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ఈ మేరకు తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
మరోవైపు ఇప్పటికే మోంథా తుపాను ప్రభావంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆరా తీశారు. ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో ఎటువంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం నిర్దేశించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయం చేసుకోవాలన్నారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని సూచించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవల్ బ్రిడ్జిలు, కాజ్వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలన్నారు.
తుపాను ప్రభావంతో వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు, ఇతర క్రిమికీటకాలు విజృంభించి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున పురపాలక, గ్రామాల పారిశుధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రాణ, ఆస్తి నష్టం, పశు నష్టం జరగకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. హైదరాబాద్లో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, అగి్నమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.












Click it and Unblock the Notifications