చంద్రబాబు తీరుతో గవర్నర్ మనస్తాపం, రాజీనామా ఆఫర్?
హైదరాబాద్: నోటుకు ఓటు కేసు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు పట్ల గవర్నర్ నరసింహన్ మనస్తాపానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తీరు పట్ల తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన రాజీనామాకు సిద్ధపడినట్లు టీ న్యూస్ వార్తాకథనం. అయితే, టీ న్యూస్ అనేది అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధికారిక న్యూస్ చానెల్గా పరిగణనలోకి వచ్చింది.
నోటుకు ఓటు కేసులో చంద్రబాబు ఏకాకి అయినట్లు కూడా ఆ చానెల్ వ్యాఖ్యానించింది. కేంద్రం జోక్యం చేసుకోవడానికి నిరాకరించినట్లు తెలిపింది. దీంతో ఏం చేయాలో చంద్రబాబుకు దిక్కు తోచడం లేదని చెప్పింది. దీంతో ఆయన ఆంధ్రప్రదేశ్ డిజిపి, ఇతర ఉన్నతాధికారులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వ్యవహారం నుంచి బయటపడేందుకు చంద్రబాబు దారులు వెతుకుతున్నారంటూ చెప్పింది.

రాజీనామా చేస్తానని చెప్పిన గవర్నర్ను కేంద్ర ప్రభుత్వం బుజ్జగించినట్లు చెబుతున్నారు. మరో వైపు, గవర్నర్ మార్పు ఉండవచ్చుననే ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి. గవర్నర్ వివక్ష ప్రదర్శిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ విమర్శిస్తున్న విషయం తెలిసిందే.
గవర్నర్ విచక్షణాధికారాలను ఉపయోగించడం లేదని, తమకు భద్రత లేకుండా పోయిందని, ఆంధ్రప్రజలకు భద్రత లేదని చంద్రబాబుతో సహా ఆంధ్రప్రదేశ్ మంత్రులు, తెలుగుదేశం నాయకులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ గవర్నర్ను లక్ష్యం చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారిపై హైదరాబాదులో దాడులు జరుగుతున్నాయని, హైదరాబాదులో శాంతిభద్రతలు క్షీణించాయని ఎపి రాష్ట్ర ప్రధాన కార్యదర్సి ఐవైఆర్ కృష్ణారావు, డిజిపి జెవి రాముడు ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఎల్సీ గోయల్కు ఫిర్యాదు చేశారు.
నోటుకు ఓటు కేసులో ఓవైపు తెలుగుదేశం పార్టీ తెలంగాణ శానససభ్యుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే ఆ విషయం మాట్లాడకుండా తనపై దాడికి తెలుగుదేశం పార్టీ దిగుతోందనే ఆవేదనతో గవర్నర్ ఉన్నట్లు చెబుతున్నారు. కేసును రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications