తెలంగాణలో ఆ నాలుగు కీలక స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు
Revanth Reddy: లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వలసలు, చేరికలు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేకించి- ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి వలసల బెడదను ఎదుర్కొంటోంది. సీనియర్లు సైతం కేసీఆర్, ఆయన పార్టీకి గుడ్బై చెబుతున్నారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల్లో చేరుతున్నారు.
ఈ పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనడానికి సమాయాత్తం అయ్యారు కేసీఆర్. జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. నీరు అందక ఎండిపోతున్న పంటలను పరిశీలించడానికి ఉద్దేశించిన పర్యటనలు ఇవి. కరవుతో బారిన పడ్డ రైతన్నలను పరామర్శించడం, వారిలో ధైర్యం నింపడానికి ఆయన ఈ పర్యటన చేపట్టారు.

తెలంగాణలో గల 17 లోక్సభ నియోజకవర్గాలకు మే 13వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఒకే విడతలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడుతాయి. 17 లోక్సభ స్థానాల్లో అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.
మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తన సీట్ల సంఖ్యను భారీగా పెంచుకోవడానికి కాంగ్రెస్ కసరత్తు సాగిస్తోంది. ఇప్పటికే 13 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కూడా. 8వ జాబితాలో నలుగురి పేర్లను ప్రకటించింది. నిజామాబాద్- టీ జీవన్ రెడ్డి, ఆదిలాబాద్- ఆత్రం సుగుణ, మెదక్- నీలం మధు, భువనగిరి- చామల కిరణ్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్ఠానం.
మిగిలిన నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఈ సాయంత్రానికి ఖరారు చేసే అవకాశం ఉంది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్.. స్థానాలు అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది.
ఈ నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయడానికి దేశ రాజధానిలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ దీనికి అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications