ఉచిత విద్యుత్పై రేవంత్ వ్యాఖ్యల కలకలం : కేటీఆర్ ఫైర్, రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు
హైదరాబాద్: రైతులకు ఇచ్చి ఉచిత విద్యుత్ సరఫరాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా ఇవాళ, రేపు(మంగళ, బుధవారాల్లో) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మలు దహనం చేయాలని సూచించింది. ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు.

విద్యుత్ ఇవ్వకుండా గతంలో రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని గుర్తు చేశారు కేటీఆర్. ఇప్పుడు మరోసారి తన రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ బయటపెట్టుకుందని అన్నారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని తెలంగాణ రైతాంగం, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు.
కాగా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ సరఫరాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక ఎకరానికి నీళ్లు పట్టాలంటే ఒక గంట సరిపోతుంది.. అలాంటప్పుడు నిరంతరాయ విద్యుత్ ఎందుకు అన్నట్లుగా ఆయన మాట్లాడటంపై బీఆర్ఎస్ మండిపడుతోంది.
‘3 hrs Congress (vs) 24 hrs BRS’
— YSR (@ysathishreddy) July 11, 2023
Revanth reddy wants not more than 3 hours electricity to the farmers. A vote to INC, means saying no to 24 hours power. There absolutely is no other leader who can think better than KCR garu for farmers
Farmers will now chose between 24 hours… pic.twitter.com/12sZVjIPFy
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయానికి నిరంతరాయ కరెంట్, రైతుబంధు పథకాలను కొనసాగిస్తారా? లేదా? అని అమెరికాలో ఎన్ఆర్ఐలు అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు రేవంత్ సమాధానమివ్వడం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. రేవంత్ వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలు కూడా తప్పుబడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే అధికార పార్టీ నేతలు, మంత్రులు రేవంత్ వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ రైతుల మేలు గురించి ఆలోచించదని ధ్వజమెత్తుతున్నారు.












Click it and Unblock the Notifications